Monday, February 20, 2012

పిల్లల్లో టెన్షన్‌కు పెద్దలదే బాద్యత

టిఫిన్ తినాలి.. రా నాన్నా’’... స్కూల్ నుండి వచ్చిన కాశ్యప్‌ని పిలిచింది తల్లి.
‘‘నాకేమీ వద్దు’’ విసుగుగా వెళ్లిపోయాడు... లోపల పుస్తకాలు టేబుల్‌పై విసిరేసిన చప్పుడు.. రోజూ ఇదే తంతు.. వీడికి ఏమైంది..? నిట్టూర్చింది తల్లి.
‘‘ఏం.. ఈసారన్నా ర్యాంక్ తెచ్చుకుంటావా? ఊరికినే ఏమీ సీట్ రాలేదు.. వేలకువేలు తగలేస్తే వచ్చింది...’’ తండ్రి అరుపులకు చిన్నబోయిన చిన్నారి మనసు దిండును కన్నీళ్ళతో తడుపుతుంది.. మొహం కనబడకుండా బుక్ అడ్డం పెట్టుకొని..
కాశ్యప్ లాంటి వాళ్లే కాదు.. ఎక్కడ చూసినా.. టెన్షన్.. టెన్షన్.. పరీక్షలుదగ్గర అవుతుంటే.. ‘ర్యాంకుల పులి’ పైనబడి పీకుతుందని చిన్నారులు బెదిరిపోతున్నారు. వారి భయాన్ని తీర్చాల్సిన తల్లిదండ్రులే బెదిరింపులకు దిగుతుంటే... ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో తెలీక బిక్కు బిక్కుమంటూ డిప్రెషన్‌లోకి జారిపోతూ... ఒక్కోసారి ఆత్మహత్యలతో లోకానికి, చదువు కష్టాలకు శాశ్వతంగా సెలవు చెప్పేస్తున్నారు. గతంలో కంటే బాగా పెరిగిన సిలబస్, పోటీతత్త్వం, సమాజమే కాక తల్లిదండ్రులు కూడా పిల్లలను మార్కులతో కొలతలు వేస్తుండటం.. తగిన నిద్ర, పౌష్టికాహారం లేక పోవటం కూడా పిల్లలలో టెన్షన్‌లు పెరగటానికి కారణమవుతున్నాయి.
పిల్లలను అన్ని విధాలా సంరక్షించి, దేశానికి ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దాల్సిన తల్లిదండ్రులు కొంచెం విజ్ఞతతో, ప్రేమతో ప్రవర్తిస్తే మనం భావితరాలను చక్కని దారిలో నడపగలం. పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకుని చదువే కాక, వారిలో సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే టీచర్లు లేరు ఈ కార్పొరేట్ ప్రపంచంలో. ఎప్పటికప్పుడు సబ్జక్టుల్లో చాప్టర్ వారీగా ప్రతిరోజు పరీక్షలు పెట్టటం, వారిని మార్కులతో తూచి, తెలివి పేరిట విడదీయటంతో చిన్నారి మనసులు విశ్రాంతి లేక టెన్షన్‌తో తల్లడిల్లిపోతున్నాయి. బాగా చదివే పిల్లలకు వత్తిడి ఉండదేమో అనుకోవటం పొరపాటు. నిజానికి ఒక్క మార్కు తగ్గినా దిగులుపడిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళేది వాళ్ళే.
చిన్న చిన్న జాగ్రత్తలతో పిల్లలకు చేయూతనందిస్తే వారిని ఈ పరీక్షల సమయంలో ఆత్మవిశ్వాసం అందించగలం. ముందుగా పిల్లలు ఏయే విషయాలలో టెన్షన్‌కు గురవుతారో పరిశీలించాల్సి ఉంది.
ప్రతిరోజూ చదువుతున్నా పరీక్షలు దగ్గరకు వచ్చిన తరువాత ఇంకా చాలా సిలబస్ చదవాల్సి ఉందని అనిపిస్తే.
మోడల్ పేపర్స్ చూసినపుడు వారికి రాని ప్రశ్న కనిపిస్తే, అది ఇంక చదవలేమని అనిపిస్తే ,వచ్చినవి కూడా మర్చిపోయినట్లు వారు తికమకపడిపోతుంటారు.
నిద్ర తక్కువైనా మెదడు అసౌకర్యంగా ఉండి సరిపోయినంత ఏకాగ్రతతో పనిచెయ్యలేదు. జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది.
ఏదైనా సబ్జెక్ట్‌లో వీక్ అయితే దానిగూర్చే ఆలోచించి దిగులు పడి మిగిలినవి కూడా చదవలేకపోతారు.
పరీక్షల భయానికి లోనై సరిగా భోజనం చేయక పౌష్టికాహార లోపం వచ్చి, కొంచెం చదివినా అలిసిపోతుంటారు. విసుగుపడుతుంటారు. విసుగుని బుక్స్ విసిరేస్తూనో, దురుసుగా మాట్లాడుతూ అమ్మానాన్నల్ని కసురుకుంటూ ఉంటారు.
కొందరికి పౌష్టికాహార లోపంతో దృష్టి దోషం వస్తుంది. అది తలనొప్పికి దారిస్తుంది.
హాస్టల్స్‌లో ఉన్న తమ పిల్లలను పేరెంట్స్ చూడటానికి వెళ్లినపుడు.. ఇంటికి వచ్చేస్తామని మొండికేయటం లేదా ముభావంగా ఉండి మాట్లాడకపోవడం జరుగుతుంది. ఏం అలా వున్నావు.. అని గట్టిగా అడిగితే కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు.
పిల్లలను కళ్ళలో పెట్టుకుని ప్రేమగా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. వాళ్ళు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు నవ్వు మొహంతో పరీక్షలు రాసి విజయకేతనం ఎగురవేస్తారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షల సమయంలో వేరే వాళ్ళతో పోల్చటం, ర్యాంకులు గుర్తుచేయటం సరికాదు. చక్కగా చదువుకొని రాయమని వాళ్ళ బాధ్యతను ప్రేమగా గుర్తుచెయ్యాలి.
ఎట్టి పరిస్థితులలో తాము ఇంత డబ్బు కట్టామనే మాట రాకూడదు. విద్యార్థి ఎన్ని మార్కులు తెచ్చుకోగలడో కనుక్కుని, దానికన్నా ఎక్కువే వస్తాయని ప్రోత్సహించాలి.
వాళ్ళు మనసు పెట్టి తినరు కాబట్టి వీలైనంత ఎక్కువగా పళ్ళరసాలు, తేనె కలిపి ఇవ్వాలి (ఐస్ వద్దు). వాళ్ళకు ఇష్టమైతే ఎప్పుడైనా జంక్ ఫుడ్ పెట్టవచ్చు. కానీ అది మితంగా పెట్టాలి. లేకుంటే పరీక్షల సమయంలో వారికి గ్యాస్ ప్రాబ్లెమ్స్ వస్తాయి.
గుడ్లు, ఆకుకూరలు, కారెట్, పాలు, ఏవైనా సలాడ్స్ ముఖ్యంగా అప్పుడప్పడు డ్రై ఫ్రూట్స్ (హాస్టల్‌లో పిల్లలకు ముఖ్యంగా) తినిపిస్తే పౌష్టికాహర లోపం రాకుండా ఉంటుంది.
వాళ్ళు తినమని మొండికేస్తే దానివలన వాళ్ళ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కోల్పోతారని ఎంతో ప్రేమగా నచ్చచెప్పాలి.
హాస్టల్‌లో పిల్లలకు వాళ్ళు ఫోన్ చేసినపుడు.. నువ్వు బాగానే రాస్తావు, పరీక్షలో అన్నీ గుర్తుకు వస్తాయి, మంచి ఆహారం తీసుకో... అని చెప్పాలి. పరీక్షల విషయాలే కాకుండా వాళ్ళ మనసు ఉల్లాసంగా ఉండేటట్లు ఏమైనా కబుర్లు చెప్పాలి.
వాళ్ళు ఒక సబ్జెక్ట్ వీక్ అని భయపడుతుంటే చాప్టర్‌వారీగా రఫ్ నోట్స్ కీ పాయింట్స్‌తో రాసుకోవాలని, వాటిని చూడగానే ఆ ప్రశ్నలు గుర్తుకు వస్తాయని చెప్పాలి.
పిల్లలు విసుగుపడుతుంటే కచ్చితంగా వారికి నిద్ర తక్కువై ఉంటుంది. వీలైతే కొద్దిసేపు ప్రశాంతంగా నిద్రపోయేటట్లు లేదా పరీక్షల గూర్చి ఆలోచించకుండా పది నిమిషాలు ప్రతిరోజు ధ్యానం చేయమని చెప్పాలి.
ఆడపిల్లలు ముఖ్యంగా ఎనీమిక్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి డాక్టర్ సలహాలతో మందులు వాడాలి.
తలనొప్పి, జలుబు లాంటి చిన్న చిన్న ఇబ్బందులను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. లేకుంటే అవి ఇప్పుడు ఇబ్బంది పెట్టటమే కాక పరీక్షల సమయంలో సమస్యలు తెస్తాయి.
తల్లిదండ్రులు నిత్యం పిల్లల ఇబ్బందులు గమనించుకొని, ప్రేమతో జాగ్రత్త వహించి వారికి అండగా నిలిస్తే వారు చక్కగా పరీక్షలు రాసి చిరునవ్వులు చిందిస్తారు. చదివే వయసులో ప్రణాళిక, పట్టుదలతో నిలవాలి. పరీక్షల సమయంలో భయాన్ని జయంచాలి.
AUTHER : -వాయుగుండ్ల శశికళ ( ANDHRABHOOMI DTD: 20/02/2012)

1 comment: