Saturday, September 28, 2013

' గాన కోకిల ' @ 85

గానకోకిల లతా మంగేష్కర్ 85వ ఏట ప్రవేశించారు. శనివారం ఆమె జన్మదినం. బాలీవుడ్ సహా పలు ప్రాంతీయ బాషా చిత్రాల్లో దశాబ్దాల పాటు గానం చేసిన లత భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జన్మదినం సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
దాదాపు ఏడు దశాబ్దాలపాటు హిందీ సినీపరిశ్రమలో గాయనిగా లతామంగేష్కర్‌ వెలుగొందుతున్నారు. 1929, సెప్టెంబరు 28న జన్మించిన ఈ గానకోకిల.. 1942 నుంచి సినీ కళా ప్రయాణం ఆరంభమైంది. 'మహల్' అనే చిత్రంలో 'ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా' అనే పాటతో తన గానాన్ని వినిపించారు. ఆమెను ‘నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా’ పిలిచేవారు. దాదాపు 36 భాషల్లో వెయ్యికు పైగా సినిమాలకు ఆమె  ఆలపించారు. క్లాసికల్‌ నుంచి రొమాంటిక్‌ వరకు, గజల్స్‌ నుంచి భజనల వరకు అన్ని రకాల గేయాలు ఆమె ఆలపించి సరికొత్త రికార్డును సృష్టించారు.
ఈమె సోదరి ఆషా భోంస్లే. లతాకు భారత ప్రభుత్వం 'భారతరత్న' పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే స్ఫురణకొస్తుంది. హిందీపాటలపై, హిందీ సినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది. 1948 నుంచి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయినిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకుంది. తెలుగులో సంతానం (నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి), ఆఖరి పోరాటం (తెల్లచీరకు, ఇళయ రాజా) మొదలైన సినిమా పాటలు పాడారు.

Sunday, September 22, 2013

100 సంవత్సరాల భారతీయ సినిమా ఉత్సవాలు...




సౌత్ ఇండియా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చేత తలపెట్టిన 100 సంవత్సరాల భారతీయ సినిమా ఉత్సవాలు సెప్టెంబర్ 21 నుండి 24వ తేదీ వరకు చెన్నై లోని నెహ్రు ఇండోర్ స్టేడియం లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలను నిన్న జయలలిత ప్రారంభించారు. ఒక్కోరోజు ఒక్కోభాషకు  పండుగలా పండుగలా కేటాయించగా మొదటిరోజు తమిళ చలనచిత్ర పండుగ జరిగింది . 
అసలు 3.5.2013 నాటికే  భారత చలనచిత్రరంగం పుట్టి 100 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. తొలిసినిమా ఇప్పుడే మొగ్గవేసింది. అప్పట్లో ఆ మొగ్గ... పెరిగి ఇంత పెద్ద పుష్పంగా మారి.. తుమ్మెదలను ఆస్వాదించే తీయదనాన్ని ఇస్తుందని ఆనాడు ఎవ్వరూ ఊహించి ఉండరు. అమెరికాలో ఫీచర్‌ ఫిల్ములు తయారైన 1912లోనే మన దేశంలోనూ తొలి కథాచిత్ర నిర్మాణం ప్రారంభమైంది. ఈ నూరేళ్ళ కాలగతిలో 1,268 మూకీలు, వివిధ భాషల్లో దాదాపు 44 వేల టాకీల అనుభవం భారతీయ సినిమా ఘనచరిత్ర. ఇవాళ అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం, ఖండాంతరాలు దాటిన అతి పెద్ద ప్రేక్షక వర్గమూ మనదే! హాలీవుడ్‌ చిత్రాలకు సైతం మనది.
 సినిమా పుట్టుపూర్వోత్తరాలను కాసేపు గుర్తుచేసుకుందాం....
లూయీ లూమియర్‌ సోదరులు : మొట్టమొదటి సినిమా నిర్మాతలు లూయీ లూమియర్‌, ఆగస్ట్‌ లూమియర్‌ సోదరులు. 1895లో పారిస్‌లోని ఒక హోటల్‌లో సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శన జరిగింది. అంతవరకు నిశ్చలనంగా ఉన్న బొమ్మలు మొట్టమొదటిసారిగా తెరపై కదలనారం భించాయి. 1903లో ప్రపంచంలో తొలి మూకీకథా చిత్రంగా ఎడ్విన్‌ పోర్టర్‌ అనే నిర్మాత కదిలే మూకీ బొమ్మలకి ఒక కథ అల్లి.. 'ది గ్రేట్‌ ట్రయిన్‌ రోబరి' అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు. భారతదేశంలో బొంబాయిలోని వాట్సన్‌ హోటల్‌లో 1896, జులై 7వ తేదీన లూమియర్‌ బ్రదర్స్‌ నిర్మించిన సజీవ సినామాటోగ్రాఫ్‌ చిత్రాలు 'ఎంట్రీ ఆఫ్‌ సినిమాటోగ్రాఫ్‌, అరైవల్‌ ఆఫ్‌ ట్రయిన్‌- చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. బొంబాయితో పాటుగా కలకత్తాలోని స్టార్‌ థియేటర్‌లో కూడా ఈ ప్రదర్శనలు వేయడంతో భారత చలనచిత్ర చరిత్ర సినీ ప్రస్థానానికి బాటలు వేయడం జరిగింది. అప్పట్లో అరైవల్‌ ఆఫ్‌ ట్రయిన్‌- చిత్రం ప్రదర్శిస్తుంటే.. రైలు మీదుగా వస్తున్నందని జనాలంతా పారిపోయేవారట. వారికి నచ్చజెప్పి మళ్ళీ తీసుకురావడానికి చాలా సమయం పట్టేది.
భారతీయ కథతో భారతీయ సంస్కృతితో నిజమైన తొలి భారతీయ సినిమాగా, ఆయన నిర్మించిన తొలి మూకీ కథా చిత్రం 'రాజా హరిశ్చంద్ర'. 1913 మే 3న బొంబాయిలోని కారొనేషన్‌ సినిమాటోగ్రాఫ్‌ థియేటర్‌లో విడుదలైంది. భారతీయ సినిమాకు శాశ్వత చిరునామా యిచ్చి చరిత్రకెక్కిన కళాకోవిదుడు దాదాసాహెబ్‌ ఫాల్కే. ఆయన తదంతరం సినిమా రంగంలో విశిష్ట సేవలందించిన వారికి ఆయన పేరుమీద అవార్డులు ఇవ్వడం ఆరంభించారు.
1927 అక్టోబర్‌ 6న 'ది జాబ్‌ సింగర్‌' అనే శబ్ద చిత్రం వచ్చింది. వార్నర్‌ బ్రదర్స్‌, న్యూయార్క్‌లో ప్రదర్శించబడ్డ ఈ చిత్రంలో తొలిసారిగా తెరమీద నుంచి మాటలు విని నివ్వెరపడి, ఆనందపడి, హర్షధ్వానాలతో సినిమా ప్రకియకు స్వాగతం పలికారు.
ఆ రోజుల్లోనే బొంబాయికి చెందిన అబ్దులలీ యూసఫలీ సినీ ప్రదర్శకుడిగా ముఖ్యపాత్ర పోషించారు. ఓ డేరాలో సంచార సినీ ప్రదర్శనల్ని ప్రారంభించారు. ఎక్కడికిపడితే అక్కడకు మోసుకుపోగల తన బయోస్కోప్‌ సామగ్రితో ఇతర దేశాలకూ వెళ్ళారు. చివరకు 1908లో భారత్‌కు వచ్చి, ఇక్కడా సంచార సినీ ప్రదర్శనలిచ్చారు. ఆట వస్తువు లాంటి బయోస్కోప్‌ను పరిశ్రమస్థాయికి తెచ్చారు.

దక్షిణ భారతావనికి వస్తే, కోయంబత్తూరుకు చెందిన రైల్వే ఉద్యోగి సామి విన్సెంట్‌ సినిమా మీద ప్రేమతో ఉద్యోగాన్ని కూడా వదిలేసి, 1905 నుంచి దక్షిణాదిన ఊరూరా తిరుగుతూ చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే, మద్రాసు ఫోటోగ్రాఫర్‌గా స్థిరపడ్డ తెలుగుబిడ్డ రఘుపతి వెంకయ్యనాయుడు విదేశాల నుంచి సామగ్రి తెప్పించి, 1909-12 మధ్యలో ప్రముఖ సినీ ప్రదర్శకుడిగా ఎదిగారు. విదేశాలకూ తన ప్రదర్శనలను విస్తరించారు.  

కళా రూపంగా సినిమా ఆవిర్భవించిన ఆ ఆరంభ దినాల్లో ఇప్పటిలాగా ప్రదర్శనలకు లైసెన్సు తీసుకోవాల్సిన అవసరమూ లేదు. అలాగే, విద్యుచ్ఛక్తితో కూడా పని లేదు. మెగ్నీషియమ్‌ దీపాల సాయంతో ఫిల్మును తెరపై చూపేవారు. ఈ సినీ ప్రదర్శనలు, వాటికన్నా ముందే దేశంలోకొచ్చిన గ్రామ్‌ఫోన్‌, ముద్రణాలయ వసతులు కలసి కొత్త పరిణామానికి దోహదపడ్డాయి. సాంప్రదాయ భారత సమాజంలో మార్పు వచ్చింది. ఈ ప్రదర్శనలకు క్రమంతప్పక వచ్చే ప్రేక్షక వర్గం తయారైంది.
     1895లో పారిస్‌లోని ఒక హోటల్‌లో లూమియర్‌ బ్రదర్స్‌ ఏర్పాటు చేసిన సినిమా టోగ్రఫీ తొలి ప్రదర్శన అయితే తెలుగులో నాగార్జున నటించిన గ్రీకువీరుడు చిత్రం నేపథ్యం కూడా పారిస్‌ కావడం విశేషం. అప్పటి తరం మిగలక పోయినా... వారు పండిం చిన పంటను ఆస్వాదించ డానికి మరిన్ని తరాలు ఇటువంటి సినిమా ఉత్సవాలను చేసుకుంటూనే ఉంటాయి.

Saturday, September 21, 2013

విచిత్ర మలుపులు తిరుగుతున్న పార్టీల పొత్తులూ ఎత్తులూ

       రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ శత్రువులూ ఉండరనేది నిజం! ఇది మరోసారి ఋజువు కాబోతోంది. నిన్న మొన్నటి వరకూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్న పక్షాలు ఒకటి కాబోతున్నాయి.. ఇది రాష్ట్ర రాజకీయాలను మరో కీలక మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.
        డిల్లీలో చంద్రబాబు బీజేపీ నేతలను కలవడంవెనక చాలా మంత్రాంగం నడిచిందని చంద్రబాబు భవిష్య రాజకీయ  అవసరం దృష్ట్యా బీజేపీతో కలవడం తప్పదని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో మోడీ వ్యాఖ్యలు, మోడీపై తెదేపా అగ్ర నాయకుల ప్రశంసలు భవిష్యత్ లో  NDA తో మరలా కలిసినడిచేందుకు ఎప్పటినుంచో బాబు ఆడుతున్న వ్యాహంగా తేలుతుంది. జగన్ ను బయటికి రాకుండా కాంగ్రెస్ తో బాబు చేతులు కలిపిన విషయం కూడా నిజమేనని పరిశీలకులు అంటున్నారు. ఇంతకాలం జగన్ జైలు నుంచి బయటికి రాకపోవడానికి చంద్రబాబు కారణమేనని, బాబు తమతో చేతులు కలుపుతాడని ఆశించి కాంగ్రెస్ ఆయనచెప్పినట్లు నడచుకుందనీ కానీఇప్పుడు కాంగ్రెస్ బాబు రాబోయే ఎన్నికల అనంతరం తమతో చేతులు కలపడని తెలిసి జగన్ ను బయటికి రాకుండా ఆపలేమని బాబుకు చెప్పినట్లు పొగట్టా .. జగన్ ఎలాగో బయటికి వస్తాడుకనుక తను ఇక కాంగ్రెస్ కు మద్దతు పలికే అవసరంలేదని బాబు భావించినట్లు చెపుతున్నారు.
        అలాగే తెలంగాణా ఇచ్చిన సందర్భంలోనూ కాంగ్రెస్ బాబునే ఇరకాటంలో పెట్టదలచిందని ఈ విషయాన్ని ఆయన గమనించే రెండు ప్రాంతాల్లో పార్టీ దెబ్బతినకుండా కాపాడుకోగలిగారనీ ఇకపై తెలుగుదేశం మరింత పుంజుకోవడం ఖాయమని తెలుగుదేశంతోపాటూ , కాంగ్రెస్ కూడా భావించిందని తెలుస్తోంది. తెలుగుదేశాన్ని దెబ్బకొట్టలంటే అది జగన్ తోనే సాధ్యమని ,ఎలాగో జగన్ ఎన్నికల తర్వాత తమకే  సపోర్ట్ చేస్తాడు కనుక అతన్ని బయటికి తీసుకువచ్చే సమయం ఇదేనని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి క్రొత్తపార్టీ పెడతారనే ఊహాగానాలు సోనియాను కలవరపెడుతున్నాయని చెపుతున్నారు. అటు తెలంగాణలో కేసీయార్ , ఇటు సీమాంధ్రలో జగన్ తనకు ప్రస్తుతానికి చాలునని ఆదిశగానే అడుగులు వేయాలని సోనియా ఇప్పటికే పార్టీ పరిశీలకులకు స్పష్టంచేసినట్లు ఉహాగానాలు వస్తున్నాయి. తెలంగాణాపై వెనకడుగు వెయ్యకూడదని , అలాచేస్తే తెదేపా కే లాభమని కాంగ్రెస్ భావించినట్లు తెలుస్తోంది
         ఇటు YSRCP కూడా చంద్రబాబును బూచిగా చూపి కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోందని తెలుస్తోంది. జగన్ బయటికి వస్తున్నారన్న సమాచారం కాంగ్రెస్ నుండి వచ్చిందని కనుక కాంగ్రెస్ పై మెతక వైఖరితో ఉండాలని YSRCP  నాయకులకు ఇప్పటికే సందేశాలు వెళ్ళాయని కొందరు భావిస్తున్నారు. మొన్న ఆ పార్టీ సమావేశంలో జగన్ ఓదార్పు యాత్రకు కూడా రోడ్ మ్యాప్ చేసారని, ఇటీవల సాక్షి పత్రిక , చానల్ లో తెదేపా,బీజేపీలనే దుమోత్తిపోస్తున్నారని వారు ఉదాహరణలు చూపుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు YSRCP పచ్చజెండా ఊపినట్లేనని విమర్శకులు చెపుతున్నారు.
        మరి ఈ రాజకీయ క్రీడలలో చివరకు ఎవరు విజేతలో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

Saturday, September 7, 2013

స్వామీ వివేకానంద

Picture
          స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాధుడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
   

      భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
    తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.


బాల్యం:-

    నరేంద్ర నాధుడు కలకత్తాలో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన విశ్వనాధ్ దత్తా మరియు భువనేశ్వరి దేవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుంచే ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటీ నుంచే అతనికి నిస్వార్థ గుణం, మరియు ఔదార్య గుణాలు అలవడ్డాయి.

    నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంథాగ్రాహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపకశక్తి అమోఘమైనది. 1880 కల్లా మెట్రిక్యులేషన్ పరీక్ష మరియు ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంకాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర మరియు సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగినాయి. అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు.

    నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరితేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందునా వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు.

రామకృష్ణ పరమహంసతో పరిచయం:-

    రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి. ఆయన పండితుడు కాదు కానీ గొప్ప భక్తుడు. అతను భగవంతుని కనుగొనిఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి ఆయనను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతోపాటు కూర్చుని ఉన్నారు. భగవంతుని గురించిన సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతోపాటు ఒక మూలన కూర్చుని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. ఆయన మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. ఆయన సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు ఆయనను చుట్టుముట్టాయి.పాతజ్ఞాపకాలేవో ఆయనను తట్టిలేపుతున్నట్లుగా ఉంది. కొద్ది సేపు అలాగే విశ్చలంగా ఉన్నాడు. నరేంద్రుడు ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయనను ఆశ్చర్యానికి గురి చేశాయి. నువ్వు పాడగలవా? అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు తమ మృధు మధురమైన కంఠంతో రెండు బెంగాలీ పాటలు గానం చేశాడు. ఆయన ఆ పాటలు వినగానే అదోవిధమైన తాదాత్మ్యత ("ట్రాన్స్") లోకి వెళ్ళిపోయాడు. కొద్ది సేపటి తరువాత నరేంద్రుడిని తన గదికి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి, ఆయనతో ఇలా అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసి పోతున్నాను. నా అనుభావలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా? అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.

    ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. ఆయనకు పిచ్చేమే అనుకున్నాడు. నీవు మళ్ళీ తిరిగి వప్పుడు తప్పించుకుందామా అని చూస్తున్న నరేంద్రుడు అందుకు సరే అన్నాడు. ఆయన బోధన పూర్తయ్యాక మీరు భగవంతుని చూశారా? అని ప్రశ్నించాడు. అవును చూశాను నేను నిన్ను చూసిన విధంగానే, ఆయనతో మాట్లాడాను కూడా, అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తపించిపోతున్నారు? అన్నాడాయన. ఇప్పటి దాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు, కానీ ఈయన మాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం?, ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు. కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు.

    ఒక నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్ కు వెళ్ళాడు. రామకృష్ణులవారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే ఆయన చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి ఆయన కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు.మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి. అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈరోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.

    నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణులవారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికా దేవి ఆయనకు మార్గనిర్దేశం కూడా చేస్తుంది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించేవరకూ గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీల గురించి ధనం గురించి వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు ఆయనకు ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో ఆయన ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేఖించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మను నేనే శివుణ్ణి అనేలాంటి వాక్యాలేవీ అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణులవారు నరేంద్రుని సరైన మార్గంలోకి తీసుకువచ్చేవాడు.

తండ్రి మరణం:-

    నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను బియ్యే పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో బియ్యే పాసయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది పిడుగు లాంటి వార్త. తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆకుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలారోజులు ఆయన పస్తులుండి తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. వారితో తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్దం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికా దేవికి మరియు సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివ, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు.

    తరువాత నరేంద్రుడు కొద్దిరోజులపాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు. గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణులవారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున ఆయన నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. ఆయన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. నరేన్! నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డలవంటి వారు. వీరిని చూసుకోవాల్సిన భాద్యత నీదే అన్నాడు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోకి బయటకు వెళ్ళిపోయి చిన్నపిల్లవాడిలా దుఖించడం మొదలుపెట్టాడు. రామకృష్ణులవారు చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి బరనగూర్‌లోమి ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణగొణ ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడినుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువసన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ప్రజలకు సేవ చేయడం , ముక్తిని సాధించడం. కొద్ది మంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులు గా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యాడు. ఆ యువ సన్యాసులు తిండి, బట్ట గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఉపవాసం ఉన్నపుడు కూడా తమ చదువును ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. అక్కడికి విచ్చేసే సందర్శకులకి గురువుగారి బోధనలను విడమరిచి చెప్పేవాడు.

వివేకానందుడిగా మార్పు:-

    నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలము, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మద్యలో గుడిసెల్లోనూ, సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేలమీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయ తలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్ది మంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్టు కొనిస్తేనే రైలులో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులేక పస్తుండాల్సి వచ్చేది.

    మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్ మరియు మైసూరు మహారాజా వారితో పరిచయం ఏర్పడింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతం లో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల మరియు వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యులు సైన్సులో మంచి పురోగతి సాధించారు. ఈ రెండు కలిస్తే మానవజాతి మంచి పురోగతిని సాధించగలదు. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చెయ్యాలనుకుంటున్నాను అని స్వామీజీ మైసూరు మహారాజాతో అన్నాడు. అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తానన్నాడు. మాహారాజా. స్వామీజీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినపుడు తప్పకుండా ఆయన సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు.

    తరువాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించాడు. అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు. మీరు అమెరికాలో జరగబోవు సర్వ మత సమ్మేళనానికి తప్పకుండా హాజరవాలి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను అన్నాడు. దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని ఆయనకు మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నాడు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నిదురపోతున్న భారతజాతిని మేల్కొలపాలనుకున్నాడు. అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచీ విరాళాలు వచ్చి పడ్డాయి. కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశాడు. అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893, మే 31వ తేదీన బయలు దేరింది.

విదేశాలలో:-
    జులై నెలలో స్వామీజీ చికాగో నగరానికి చేరుకున్నాడు. దారిలో ఆయన కొలంబో, సింగపూర్, హాంకాంగ్, టోక్యో వంటి ఓడరేవు లను కూడా సందర్శించాడు. అక్కడ తాను వెళుతున్న ప్రపంచ సర్వమత సమ్మేళనాన్ని గురించి వాకబు చేశాడు. అప్పటికి ఆ సదస్సుకు మూడు నెలల వ్యవధి ఉంది. చికాగో నగరం చాలా ఖరీదయిన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. దారి మద్యలో ఒక మహిళ స్వామికి పరిచయం అయింది. ఆయనతో కొద్ది సేపు మాట్లాడగానే ఆమెకు ఆయన గొప్పతనమేమిటో అర్థం అయింది. ఆయన సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంటిలో బస చేయమని కోరింది. స్వామీజీ అందుకు అంగీకరించాడు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభలలో ఉపన్యసించేవాడు. వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి మరియు హిందూ ధర్మం ప్రధాన అంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు ఆయనకు మిత్రులయ్యారు. వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్. అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం లో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలా మంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు.[1] స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చాడు. సదస్సు 1893, సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది. అందరు సభ్యుల దగ్గరా ఉన్నట్లు ఆయన దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు. అతని ప్రసంగాన్ని చివరలో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణులవారినీ, సరస్వతీ దేవిని మనస్పూర్తిగా ప్రార్థించాడు.
అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! అని స్వామీజీ తన మృధు మధుర కంఠస్వరంతో అనగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది.శబ్దం ఆగిన తరువాత తన ప్రసంగాన్ని ఆరంభించాడు. [2] అక్కడున్న ప్రతీ ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. ఆయన మాట్లాడడానికి లేచాడంటే చాలు, చెవులు చిల్లులుపడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి. కొన్ని సంస్థలు సభ జరుగుతున్నపుడు మద్యలోనే తమ సంస్థకు ఆహ్వానించేవి.అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలా సేపు వివరించేవాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రం అయినా, తత్వశాస్త్రం అయినా, సాహిత్యమైనా ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు.కొత్త అవతారం,హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం,ఈ మూడు గుణాలతో ఆయన అందరి హృదయాలను గెలవగలిగాడు.వాదనలలో ఆయనను గెలవగలిగిన వారు లేరు.ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. అటువంటి మనీషి యుగానికి ఒకరే పుడతారు.ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని ఒక పత్రిక వ్యాఖ్యానించింది.

    స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ఆయన ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమికూడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తరువాత ఆయన్ని తమ ఇళ్ళకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వార్తాపత్రికలు ఆయనను ఘనతను, వాగ్ధాటిని శ్లాఘించాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదిత గా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. తరువాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోవడం జరిగింది.

    నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897 ఆయన కొలంబోలో దిగగానే ఆయనకు చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకొనేటప్పటికి ఆయన అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు.లెక్కలేనన్ని పూలమాలలు, సందేశాలు లభించాయి. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు.ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు. అదే స్పూర్తితో, లక్ష్యంతో1897 లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. తరువాత రెండు సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూర్ వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాల్ని నిర్మించాడు.

ముఖ్య సూత్రములు తత్త్వములు:-

వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవ తో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహము ను కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము)ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు"(आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) అనే నినాదము మీద స్థాపించాడు.
సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగువాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది.సోదర ప్రేమ గురించి ప్రసంగాలుమాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మంయొక్క అంశాలు.

మరణం:-

అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని ఆయన శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రాన రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ ఆయన ఆత్మ,మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యధావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయనఅలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే దుఖించారు.

Picture
Picture