Sunday, November 27, 2011

ప్రపంచ ఇంటర్నెట్ వినియోగదారుల సమాచారం ...



Tuesday, November 8, 2011

ఇకనైనా ఆడపిల్ల " లక్ష్మి దేవి " అందాం- లింగ వివక్షను రూపుమాపుదాం



లింగవివక్షతను తగ్గించడంలో మన దేశం ఆశాజనకమైన పాత్ర ఏమీ నిర్వహించడం లేదని యునెటైడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ పోగ్రాం (యుఎన్‌డిపి) రూపొందించిన తాజా నివేదికలోని లెక్కలను చూస్తే తేలిగ్గానే తెలిసిపోతుంది. మన దేశంలో తిష్ట వేసిన లింగవివక్షతను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందడుగు వేయవలిసిన సమయం ఇది.

లింగవివక్షత అనేది ఎప్పటికప్పుడు కొత్తగా వినిపిస్తున్న పాత పదం. యుఎన్‌డిపి జెండర్ ఇన్‌ఈక్వాలిటి ఇండెక్స్‌లో మన దేశానికి 134 ర్యాంక్ వచ్చిన నేపథ్యంలో లింగవివక్షత మరోసారి చర్చల్లోకి వచ్చింది. లింగవివక్షత అనేది కేవలం ఉపరితల సమస్య కాదు. దాని మూలాలు మన ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక రంగాల్లో బలంగా వేళ్లూనుకొని ఉన్నాయి.

ఇక్కడే మొదలవుతుంది.... 
‘‘అయ్యో! అమ్మాయి పుట్టింది’’ అని బాధ పడే వారు ఈ కాలంలోనూ ఉన్నారు. ఆడబిడ్డకు జన్మనిచ్చేందనే కారణంతో భార్యలను హింసపెట్టే భర్తలు కూడా ఉన్న కాలం ఇది.
అమ్మాయి పుట్టినప్పుడు వచ్చే స్పందనకు, అబ్బాయి పుట్టినప్పుడు వచ్చే స్పందనకు మధ్య కనిపించే తేడాతోనే లింగ వివక్షతకు తొలి బీజం పడుతుంది. ‘అమ్మాయి పుట్టింది’ అని భయపడడానికి ఆర్థికవిషయాలు కూడా ఒక కారణం అవుతున్నాయి. ఫలానా పని అబ్బాయిలే చేయాలి, ఫలాన పని అమ్మాయిలే చేయాలి అనే కృత్రిమవర్గీకరణ వలన లింగవివక్షత మొదలవుతుంది. లింగవివక్షతకు తొలిబీజం కుటుంబంలోనే పడుతుంది.
‘‘మగరాయుడిలా ఆ సైకిల్ తొక్కడం ఏమిటి?’’ అని విసుక్కుంటారు.
(సైకిల్ తొక్కడం మీద అబ్బాయికు మాత్రమే పేటెంట్ ఉన్నట్లు!)
కాస్త గట్టిగా మాట్లాడితే-‘‘అమ్మాయిలా అణకువగా మాట్లాడు’’ అని తిడతారు.
జ్ఞానం ప్రవహించే బడిలో కూడా మనకు తెలియకుండానే వివక్ష ప్రతిఫలిస్తుంది.
‘‘ఈ ప్రశ్నకు జవాబు చెప్పకపోతే అమ్మాయిల చేత చెంపదెబ్బలు వేయిస్తాను’’ అని బెదిరిస్తారు. ఈ బెదిరింపులో ‘అమ్మాయిల చేత దెబ్బ తినడం సిగ్గుచేటు’ అనే పక్కదారి పట్టించే సందేశం ఉంది.

తాతాముత్తాతల కాలంతో పోల్చితే స్త్రీల పరిస్థితి మెరుగుపడవచ్చుగాక, విద్యా ఉద్యోగరంగాల్లో రాణించవచ్చుగాక. అయితే లింగవివక్ష తొలిగిపోయింది అని చెప్పడానికి ఇది మాత్రమే ఆశాజనకమైన ప్రమాణం కాదు. ఇప్పటికీ చాటుమాటుగా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. చాలా రాష్ట్రల్లో గ్రామీణప్రాంతాల్లో బాల్యవివాహాలు ఇప్పటికి జరుగుతున్నాయి. ఉన్నతచదువులు చదివినప్పటికీ పెళ్లి కాగానే మహిళలను ఇంటికి పరిమితం చేసే పద్ధతులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
భూమి, ఆర్థికసేవలు, విద్య, మార్కెటింగ్ తదితర రంగాల్లో పురుషులతో సమానంగా స్త్రీలకు ప్రాతినిధ్యం లేదు. ప్రాధాన్యత లేదు. పురుషులతో పాటు స్త్రీలకు కూడా ఆయారంగాల్లో ప్రాతినిధ్యం కల్పిస్తే ఫలితాలు బాగుంటాయని ఆర్థికనిపుణులు చెబుతున్నారు. ‘‘వ్యవసాయరంగంలో పురుషులతో పాటు స్త్రీలకు అవకాశం కల్పిస్తే ఉత్పత్తి భారీగా పెరుగుతుంది’’ అని ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఇప్పుడు చేయాల్సింది ఏమిటి?
లింగవివక్షతను నిర్మూలించడానికి ఎవరో కంకణం కట్టుకోని బయలుదేరాల్సిన అవసరం లేదు. తమ బాధ్యతగా ఎవరి వారు సామాజికస్పృహతో ఉంటే లింగ వివక్ష రెక్కలు విరవచ్చు. వివక్షత లేని సమాజాన్ని నిర్మించ వచ్చు.

Monday, November 7, 2011

తెలుగులో కలం పేర్ల కథా కమామిషు...

రచయితల మారుపేర్లను కలం పేర్లు, శ్యౄ జూళ ఔఖౄళ అని వ్యవహరించడం జరుగుతున్నది. ప్రాచీన సాహిత్యంలో, ముఖ్యంగా సంస్కృత సాహిత్యంలో కవుల మారుపేర్లు అనేకరకాలుగా సంక్రమించిన పేర్లు, ఆధునిక కాలంలో చాలావరకు పెట్టుకున్న పేర్లు, ప్రకటించుకున్న పేర్లు, యూరో అమెరికన్ సాహిత్యంలో ప్రసిద్ధ రచయితలు కొందరు కలం పేర్లతోనే ప్రపంచానికి తెలుసు. సామ్యూల్ క్లెమెన్స్ మార్క్‌టెయిన్ పేరుతో రచనలు చేశాడు. కథారచయిత ఓ.హెన్రీ అసలు పేరు విలియమ్ సిడ్నీ పోర్టర్. మేరీ ఎన్ ఇవాన్స్ కలం పేరు జార్జ్ ఇలియట్. పద్దెనిమిదవ శతాబ్ది ప్రసిద్ధ ఫ్రెంచ్ తత్వవేత్త అసలు పేరు ష్రాంసువా మేరీ అరోవ్. స్ర్తిలు పురుషుల పేర్లను కలం పేర్లుగా ఉపయోగించుకోవడం ఉండేది. పురుషులు కూడా స్ర్తిల పేర్లతో రాయడమూ కనిపిస్తుంది. ప్రక్రియనుబట్టి, రచనా స్వభావాన్నిబట్టి వేరు వేరు పేర్లతో రాసిన రచయితలున్నారు. శాస్త్ర రచయితలు సృజనాత్మక రచనలు చేసేప్పుడు వేరే పేరును ఉపయోగించడం కూడా కనిపిస్తుంది. ఒక పేరుతో ప్రసిద్ధమైన రచయిత వేరే పేరుతో రాస్తే ఒకే రీతిలో ఆదరిస్తారా లేదా అని తెలుసుకోవడానికి కలం పేరుతో కొన్ని రచనలు చేయవచ్చు.
రచయితలు పేర్లను ఎన్నుకోవడంలో అనేక దృష్టి కోణాలుంటాయి. పేరు సరళంగా ఉండి సులభంగా ప్రచారంలోకి రావడం ఒక ముఖ్యమైన ప్రయోజనం. గౌరవం పెరగడం, జనామోదం పొందడం కూడా పేర్లను ఎన్నుకోవడానికి కారణాలవుతున్నాయి. పేరు నాగరికంగా లేదని కొందరు పేర్లు మార్చుకుంటే, కొందరు తమ గుర్తింపును కప్పిపుచ్చుకోవడానికి కలంపేర్లు పెట్టుకుంటారు. కులం, మతం తెలియకుండా ఉండాలనుకుని వేరుపేర్లు పెట్టుకున్నవాళ్లున్నారు. ఎక్కువగా శృంగారాన్ని గుప్పించే రచయితలు తరచుగా మారుపేరుతోనే రచనలు చేస్తారు. కొన్ని రచనలకి రచయితలు ఎవరో తెలియకపోవచ్చు. వాటినే అజ్ఞాత కర్తృకాలని అంటున్నాం. వౌఖిక సంప్రదాయంలో సంక్రమించిన సాహిత్యం, జానపద సాహిత్యం అజ్ఞాత కర్తృకాలుగా పేర్కొనడం జరుగుతున్నది. కలం పేర్లను నిర్దిష్ట నామాలు, అనిర్దిష్ట నామాలు అని రెండు రకాలుగా గుర్తించవచ్చు. నిర్దిష్ట నామాలు వ్యక్తినామాల లాగే ప్రచారంలోకి వస్తాయి. కొందరు నిర్దిష్టమైన కలం పేర్లను ప్రత్యామ్నాయంగా మాత్రమే వాడతారు. కొందరు అవసరాన్ని, సందర్భాన్నిబట్టి గుణవాచకాన్నో, విశేషణాన్నో కలం పేరుగా ఉపయోగిస్తారు. వీటిని అనిర్దిష్ట నామాలనవచ్చు. కాస్త వెనక్కి వెళ్లి పాత పత్రికలు తిరగేస్తే రచయితల మారుపేర్లు, కలం పేర్లు కోకొల్లలుగా కనిపిస్తాయి.
తెలుగు సాహిత్య లోకంలో కలం పేరుతో మాత్రమే తెలిసిన కవులు, రచయితలు చాలామందే ఉన్నారు. సరళంగా ఉండి, సులభంగా ప్రచారంలోకి వచ్చే పద్ధతిలో ఉంటాయి ఈ పేర్లు. ఆత్రేయ, ఆరుద్ర, అజంతా, ఎల్లోరా, ఓల్గా మొదలైన పేర్లు ఈ కోవలోకి వస్తాయి. కులం తెలియకుండా ఉండడానికి నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, భైరవయ్య అన్న పేర్లు పెట్టుకున్నామని దిగంబర కవులు ప్రకటించుకున్నారు. ఆరుగురూ కలం పేర్లతోనే ప్రసిద్ధి పొందారు. మతం తెలియకుండా పెట్టుకున్న పేర్లు రుద్రప్రియ, సుగమ్‌బాబు, కౌముది. ప్రభుత్వ ఉద్యోగాలలోనో, ఆకాశవాణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనో పనిచేసేవారు ఇంకొక చోట సొంత పేరుతో రాయడానికి వీలులేని పరిస్థితులలోనో, భద్రత కోసమో కలంపేర్లను ఉపయోగించుకుంటారు.
ఆకాశవాణిలో పనిచేసిన యండమూరి సత్యనారాయణ ‘శ్రీవాత్సవ’ పేరుతో రచనలు చేశారు. తెలుగు స్వతంత్ర వార పత్రికలో ప్రతి సంవత్సరం ఆయనచేసిన సాహిత్య సింహావలోకనాలు చాలా ప్రసిద్ధాలు. ఏ కారణం చేతనో కల్లూరి వేంకట నారాయణరావు 1928 ప్రాంతంలో కవిత్వవేది పేరుతో ఆంధ్ర వాజ్ఞ్మయ చరిత్ర సంగ్రహం రాశాడు. తనది ప్రచ్ఛన్న నామమే కాని బిరుదం కాదని చెప్పుకున్నారు. ఆకాశవాణి ఉద్యోగంలోనే జీవితం గడిపిన బాలాంత్రపు రజనీకాంతరావు వేరే పేర్లతో రచనలు చేశారు. సినిమాలకీ రాశారు. పోలీసు శాఖలో పనిచేసిన మోహనరావు స్పార్టకస్ పేరుతో నవలలు రాశారు. పోలీసు జీవితానికి సంబంధించిన వస్తువుతో ఆయన రచనలు చేశారు. మల్లయ్య పేరుతో పంపిన రచనలు తిరిగి వస్తే నవీన్ అని పేరు పెట్టుకున్నారు అంపశయ్య రచయిత.
రచయితలు అనేక రకాలుగా కలంపేర్లను ఎన్నుకోవడం కనిపిస్తుంది. 1. నక్షత్రాలు: ఆరుద్ర (ఆర్ధ్ర), జ్యేష్ఠ, అశ్విని, ఆశే్లష, 2. ప్రకృతి: సముద్రుడు, సూరీడు, ఓల్గా. 3. సంస్కృతి: అజంతా, ఎల్లోరా, అతిథి, 4. పురాణాలనుంచి: గాండీవి, త్రినేత్ర, విశ్వామిత్ర, 5.చరిత్రనుంచి: శాలివాహన, కౌటిల్యుడు, మల్క్భిరాం, స్పార్టకస్, 6.సాహిత్యంనుంచి: భాసుడు, భారవి, క్షేమేంద్రుడు, 7.గోత్రనామాలు: ఆత్రేయ, కౌండిన్య.
ఈ పద్ధతులు కాక మరికొన్ని పద్ధతులు కూడా కలం పేర్లలో కనిపిస్తాయి. పురుషులు స్ర్తిల పేర్లతో రాయడం వీటిలో ముఖ్యమైంది. పి.ఎన్. ఆచారి లల్లాదేవి పేరుతో రచనలు చేశారు. నటరాజన్ శారద పేరుతో రాశారు. పి.విజయకుమార్ భార్య సౌభాగ్య పేరుతో రచనలు చేస్తున్నారు. బీనాదేవి భిన్నమైన పేరు. భార్యాభర్తలు ఇద్దరూ రచయితలే. బి.నరసింగరావు సంక్షిప్త నామం ‘బిన’, భార్య పేరులో చివరి భాగం ‘దేవి’ కలిసి బీనాదేవి అయింది. రచయిత్రి ఆనందరామం పేరులో తన పేరు సగం భర్త పేరు సగం కలిసి ఉంది. ఇంటా బయటా అలవాటైన ముద్దు పేర్లే కలం పేర్లుగా పరిణమించడం కూడా కనిపిస్తుంది. శివరాజు వెంకట సుబ్బారావుకి బుచ్చిబాబు అని పేరు వచ్చిన తీరిది. దేవులపల్లి సుబ్బరాయ శాస్ర్తీ బుజ్జాయిగ మాత్రమే లోకానికి తెలుసు. ఇంట్లో మహబూబ్ అలీకి పెట్టిన ముద్దు పేరు అఫ్సర్. అదే అతని కలం పేరు అయింది. రచయితలు మారు పేర్లు పెట్టుకునే పద్ధతులు, పేర్లు మార్చుకునే పద్ధతులు అనేక రకాలుగా ఉంటాయి. అసలు పేరేమో అని భ్రమ కలిగించేటట్టుంటాయి కొన్ని మారుపేర్లు. కొమర్రాజు లక్ష్మణరావు క.రామానుజరావు పేరుతో కథలు రాశారు. సురవరం ప్రతాపరెడ్డి భావకవి రామమూర్తి పేరుతో రచనలు చేశారు. వేమరాజు భానుమూర్తి భాస్కరాచార్య పేరుతో రాశారు. అందమైన సమాసాలను కలం పేర్లుగా వాడుకున్న వాళ్లున్నారు. వరవరరావు కలం పేర్లలో ఒకటి చంద్రమల్లిక. జలదాంతశ్చంద్ర చపల చేకూరి రామారావు ఒక సందర్భంలో వాడిన పేరు. ఎవరో తెలియదు కాని మల్లీప్రియ నాగరాజు పేరుతో సాహిత్య విమర్శ చేశాడొకాయన. ఒకే పేరు ఇద్దరు రచయితలకు ఉన్నప్పుడు వాళ్లను గుర్త్తించడానికి వేరు వేరు పద్ధతులు అనుసరించడం కనిపిస్తుంది. ఇస్మాయిల్ పేరుతో ఇద్దరు రచయితల ప్రసిద్ధులు. ఒకరు స్మైల్ అయినాడు. ఒకే కుటుంబానికి సంబంధించిన వారైతే సీనియర్, జూనియర్ అని చేర్చడం కనిపిస్తుంది. సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, వేదం వేంకటశాస్ర్తీ జూనియర్ ఇలాంటివే. పూర్తిపేరుతోనే రచనలు చేసినా ఇంటిపేరుతో కొందరు రచయితలు ప్రచారంలో ఉంటారు. కందుకూరి, గురజాడ, దేవులపల్లి, విశ్వనాధ, అనిశెట్టి, గొల్లపూడి, మునిమాణిక్యం, ఏల్చూరి, దాశరథి, కుందుర్తి, కాళోజీ, కొవ్వలి, నార్ల, సలంద్ర ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. ఎలకూచి బాల సరస్వతి పదిహేడవ శతాబ్దపు తెలుగు వైయాకరణుడు. ఎలకూచి ఇంటిపేరుగల ఎలకూచి వెంకటరమణ ‘బాలసరస్వతి’ కలంపేరుగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది.
శ్రీశ్రీ, ఆరుద్ర మొదలుకుని కలం పేరుతో ప్రసిద్ధులైన రచయితలెందరో ప్రత్యేక సందర్భాల్లో ఎన్నో మారుపేర్లతో వ్యాసాలు రాసి, శీర్షికలు నిర్వహించారు. ఒకేపత్రికలో వేరు వేరు శీర్షికలు నిర్వహించవలసి వచ్చినప్పుడు వేరు వేరు పేర్లను ఉపయోగించిన వాళ్లున్నారు. కొందరు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కలం పేరు వాడారు. పండితుడు, విమర్శకుడు అక్కిరాజు ఉమాకాన్తమ్ 1913-14 మధ్య ‘ఆర్యుడు’ అనే పేరుతో త్రిలిఙ్గ పత్రికలో కథలు రాశారు.
తెలుగు సృజనాత్మక రచయితలలో ఎక్కువగా మారుపేర్లతో రచనలు చేసిన వాళ్లలో రాచకొండ విశ్వనాధ శాస్ర్తీని చెప్పుకోవాలి. రచయితలు రచనలు చేస్తున్న తొలినాళ్లలో ఆత్మవిశ్వాసం లేకపోవడంవల్లనో, బిడియం వల్లనో, ఆర్థిక కారణాల వల్లనో ఒకటి కంటే ఎక్కువ మారుపేర్లు ఉపయోగించడం సాధారణం. నిర్దిష్టంగా ప్రచారంలో లేని కలం పేర్లని అనిర్దిష్ట నామాలని అనవచ్చు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక అవసరాలను బట్టి ఉపయోగించుకునే పేర్లివి. వ్యక్తి నామరూపంలోని కలం పేర్లలాగా ఈ పేర్లు ప్రచారంలో ఉండవు. ఇటువంటి పేర్లు సాధారణంగా విశేషణాలై ఉంటాయి. పరిశోధన, విమర్శ, చర్చలు చేసే సందర్భాలలో లేఖకులు ఈ పద్ధతిని అవలంబిస్తారు. చర్చలలో తానెవరో తెలియకుండా ఉండడానికి రచయితలు ఉపయోగించే ప్రత్యేక సంజ్ఞలే అనిర్దిష్ట నామాలు. చర్చకు సంబంధించిన విషయాన్ని, కార్యక్షేత్రాన్ని, రాజకీయాలను, వృత్తిని, ప్రవృత్తిని, వర్గాన్ని, దృక్పథాన్ని, భావ జాలాన్ని, ఆసక్తిని, అభిరుచిని, నిరసనను, స్వభావాన్ని, వైయక్తిక స్థితిని సూచించేట్టు ఉంటాయి ఈ పేర్లు. పాత పత్రికలలో, రచయితల పట్టికలలో కనిపించే కలం పేర్లు కొన్ని ఉన్నాయి.
పరిశోధన, విమర్శ రంగాలలో విస్తృతంగా రాసేవాళ్లు, చర్చలు, వాదోపవాదాలు, ప్రతివాదాలలో పాల్గొనేళ్లు, వివిధ రంగాలలో పనిచేసే అవసరం ఉన్నవాళ్లు రకరకాలుగా మారుపేర్లను, విశేషణ రూపంలో పేర్లను ఉపయోగిస్తారు. చర్చలలో తీవ్రమైన ప్రతిస్పందనలు వ్యక్తం చేసేటప్పుడు పేరుమార్పు తప్పనిసరి అవుతుంది. వీటిని ఒకరకంగా ప్రచ్ఛన్న నామాలు అనవచ్చు. పండితుడు, పరిశోధకుడు, బహుభాషావేత్త, పాత్రికేయుడు తిరుమల రామచంద్రకు పదుల సంఖ్యలో పేర్లున్నాయి. నిరంతరం రాసే కె.వి.రమణారెడ్డి కూడా పదుల సంఖ్యలో పేర్లను ఉపయోగించుకున్నారు. పండిత పరిశోధకుడైన వేటూరి ప్రభాకర శాస్ర్తీ చాలా పేర్లతో రాశారు.
తెలుగు సాహిత్యంలో జంటకవుల సంప్రదాయం ఉంది. పూర్తిగా మారుపేర్లు కావు కాని ఇద్దరు కవుల పేర్లతో ఏదో ఒక సంబంధం కల పేర్లు కలిసి కవుల పేర్లు ఏర్పడతాయి. తిరుపతి వేంకట కవులు, వేంకట పార్వతీశ్వర కవులు, శేషాద్రి రమణ కవులు మొదలైన విధంగా అసలు పేర్లు పూర్తిగానో, పాక్షికంగానో కలిసి పేర్లు ఏర్పడతాయి. పింగళి కాటూరి కవులు వంటివి ఇంటిపేర్లతో ఏర్పడ్డపేర్లు. కవులు సోదరులైతే కొప్పరపు సోదర కవులు, ఆదిపూడి సోదరకవులు, కోట సోదర కవులులా పేర్లేర్పడతాయి. ఇద్దరి కంటే ఎక్కువమంది కవులు కలిస్తే గుంపు కవులు, సమూహ కవులు అనవచ్చు. సమూహ కవులు అందరినీ గుంపుగా గుర్తించే పేరు పెట్టుకుంటారు. నయాగరా కవులు, దిగంబర కవులు, పైగంబర కవులు, తిరుగబడు కవులు, విపశ్యన కవులు ఆధునిక తెలుగు సాహిత్యంలో కనిపించే సమూహ కవులు. పేర్ల తొలి అక్షరాలు కలిపి పెట్టుకున్న అద్వయం, భైకొ, శిరసుల చిక్కుముడి విప్పడం భవిష్యత్తరాల వారికి అంత సులభం కాదు. తెలుగులో మారుపేర్లు, కలం పేర్లను గురించి ఇంతవరకు తెలుసుకోగలిగింది చాలా తక్కువే. మరింత పరిశోధిస్తే మరెన్నో సాహిత్యపరమైన అంశాలు వెలికివచ్చే అవకాశాలున్నాయి. సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. కలం పేర్ల కథను వివరంగా, విస్తృతంగా తెలుసుకోగోరేవారు కె.పి.అశోక్‌కుమార్, ఎ.ఎన్.రాజు కూర్చిన గ్రంథం తెలుగులో మారుపేరు రచయతలు ప్రధాన భాగంలోకి వెళ్లాలి మరి. 
-కె.కె.రంగనాథాచార్యులు ( నేటి ఆంధ్రభూమి నుండి )

Friday, November 4, 2011

చంద్రబాబును విచారించండి: వైఎస్ జగన్

ఓఎంసీ వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కూడా విచారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐకి విజ్ఞప్తి చేశారు. జగన్ శుక్రవారం ఉదయం కోఠీలోని సీబీఐ కార్యాలయానికి సాక్షిగా హాజరై తన వాదనలు వినిపించారు. సుమారు రెండు గంటల విచారణ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ 2002 సంవత్సరంలోనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 64.2 ఎకరాల భూమి లీజు ను బదిలీ చేశారన్నారు.

అందుకు సంబంధించిన జీవో ప్రతిని ఆయన చూపించారు. 1996 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాంమ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ భూమిని గనుల లీజుకు ఇచ్చారని అన్నారు. అదే చంద్రబాబు 2002లో రాంమ్మోహన్ రెడ్డి నుంచి ఆ లీజును ఓఎంసీకి బదిలీ చేశారని జగన్ వివరించారు. 


ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని, వారి విచక్షణ మేరకే నిర్ణయాలు జరిగాయని ఓఎంసీకి గనుల లీజును బదిలీ చేసింది చంద్రబాబే అయినప్పుడు, ఏడాదిన్నరగా ఇదే అంశంపై విచారిస్తున్న సీబీఐ చంద్రబాబును కూడా విచారించాలని తాను అభ్యర్థించానని జగన్ అన్నారు. జీవో కాపీని సీబీఐ అధికారులకు అందచేసినట్లు కూడా ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభమైన ఏడాదిన్నర తర్వాత తనను ఒక సాక్షిగా మాత్రమే సీబీఐ పిలిచిందంటే... ఇందులో తనకు సంబంధం లేదనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా సాక్షిగానే విచారించిందన్నారు. 

చంద్రబాబునాయుడు... ఆయనతో కుమ్మక్కైన ఎల్లో మీడియా .... ఈనాడు, ఆంధ్రజ్యోతి, కొంతకాలం కిందట వారితో జత కలిసిన టీవీ9 వీరందరికీ నేను చెప్పేది ఒక్కటే. జర్నలిస్ట్ నీతిని పాటించండి. మీరు ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏముందో బయటకు చెప్పండి అని అన్నారు. ఆయన క్లుప్తంగా మాట్లాడిన మాటల్లో ఎక్కడ తొట్రుపాటు కనిపించలేదు. జగన్ వెంట ఎంపీ రాజమోహన రెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, టి బాలరాజు తదితరులు ఉన్నారు.

విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి బయల్దేరిన జగన్

http://www.mirapa.com/wp-content/uploads/2011/09/jagan-23.jpgవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం కోఠీలోని సీబీఐ కార్యాలయానికి బయల్దేరారు. సీఆర్‌పీసీలోని సెక్షన్ 160(1) ప్రకారం ఓఎంసీ వ్యవహారంలో ఆయన్ని సీబీఐ విచారించనుంది. ఈ నేపథ్యంలో కోఠి సీబీఐ కార్యాలయంలో పోలీసులను భారీగా మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా కోఠి నుంచి రాంకోఠి వరకు మార్గాన్ని మూసివేస్తున్నారు. 
కాగా కోఠీ సీబీఐ కార్యాలయానికి తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Thursday, November 3, 2011

సాధించాలంటే సాహసించాల్సిందే

‘సాహసం చేయరా డింభకా రాజకుమారి దక్కుతుంది...’ అంటూ అలనాడు ‘పాతాళభైరవి’ సినిమాలో యస్వీ రంగారావు, రామారావును ప్రేరేపించటం మనకు గుర్తుంది. సాహసంతోనే అసాధ్యాలను సుసాధ్యాలుగా మలచుకొని, తాను వలచిన రాజకుమారిని పెళ్లాడాడు సాధారణ తోటరాముడు. అది సినిమా కావొచ్చు. కల్పన కావొచ్చు. కాని.. సాహసాలు చేసి ఎందరో కొత్త ఆవిష్కరణలకు, అద్భుతాలకు తెర తీశారనటం వాస్తవం.
సాంకేతికపరమైన అంశాలు అందుబాటులో లేని కాలంలో సముద్ర మార్గం ద్వారా ఐరోపా ఖండం చుట్టి.. భారతదేశం చేరుకున్న పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా సాహస యాత్ర.. చరిత్రను ఎన్ని మలుపులు తిప్పిందో మనందరికీ తెలుసు. ఆనాడు ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో నావికులు చేసిన సాహస యాత్రల మూలంగా ఎన్నో చీకటి ఖండాలు వెలుగులోకి వచ్చాయి.
సాహసించకపోతే.. టెన్సింగ్ నార్కే మహోన్నత హిమగిరి ఎవరెస్ట్‌ను అధిరోహించి ఉండేవాడా? యూరీ గగారిన్ అంతరిక్ష యాత్ర చేసి ఉండేవాడా? నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మోపగలిగేవాడా?.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో సాహసవంతమైన విజయాలు మనకు కనిపిస్తాయి.
అయితే.. ప్రతి సాహసం వెనుక విజయం ఉండకపోవచ్చు. జయాపజయాలు సాధారణం. సాహసించే ప్రతివారూ విజయం కోసమే తపిస్తారు. విజయ లక్ష్యంగానే సాహసానికి పూనుకుంటారు. ఒక్కోసారి దురదృష్టం వెంటాడి.. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి.
కొన్ని రకాల సాహసాలలో పాల్గొనే వారికి.. అదెంత ప్రమాదకరమైనదో తెలుసు. అదుపు తప్పితే జరిగే పరిణామాలేమిటో తెలుసు. అయినా వారు ఆ సాహసం పట్ల ఆసక్తిని కనపరుస్తారు. అంతేకాదు దానిని వారు ఓ ఛాలెంజ్‌గా తీసుకుంటారు. విజయం తమదేననే భరోసాతోనే ముందుకు సాగుతారు. అపజయాన్ని, ప్రమాదాన్ని ఎవరూ ముందుగా ఆశించరు. తమకన్నా ముందు అలాంటి సాహసకృత్యాలలో ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలైన లేదా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసినా.. అదే సాహసకృత్యానికి పూనుకునేవారూ ఉన్నారు. అంతరిక్ష నౌక పేలిపోయినంత మాత్రాన అమెరికా అంతరిక్ష ప్రయోగాలు ఆగిపోయాయా..? మరింత సాంకేతిక జాగ్రత్తలు పెంచుకుంటూ ముందుకు సాగటం లేదా? కల్పనా చావ్లా దుర్మరణం చూసి భయపడి వుంటే.. సునీతా విలియమ్స్ సక్సెస్ సాధించి ఉండేదా? మరి కొంతమంది వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యేవారా? అందుకే సాహసికులు జరిగిన సంఘటనలకు భీతి చెందరు. అలా భీతి చెందేవారు అసలు అలాంటి సాహసానికి సిద్ధపడరు.
సాహసమే నా ఊపిరి.. విజయమే నా లక్ష్యం అనే సిద్ధాంతం వారిది. అయితే చాలామంది అనుకోవచ్చు - ప్రాణాంతకమైన సాహసకృత్యాలు అవసరమా అని? మరి అవే లేకపోతే.. మానవ జాతి ఇంత ప్రగతి సాధించేదా? అందుకే ప్రతి విజయం వెనుక ఓ సాహసం, ఓ ఉత్సాహం, ఓ ప్రేరణ తప్పనిసరి. అయితే ప్రతి సాహసం పాజిటివ్ దృక్పథం కలిగినదై ఉండాలి.
అయితే సాహసాలకు పూనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
తాము పూనుకోబోతున్న సాహసం వెనుక ఎలాంటి ప్రమాదాలు ఉండగలవో ముందుగా ఒక అవగాహనకు రావాలి. గతంలో ఏ లోపాల వల్ల ప్రమాదాలు జరిగాయో పరిశీలించాలి. వాటిని లోతుగా విశే్లషించుకోవాలి. దానికి తగిన విధంగా వ్యూహాలను ఆలోచించాలి. ముందస్తు ప్రణాళికను సమగ్రంగా రూపొందించుకోవాలి.
అనుకోకుండా సంభవించే ప్రమాదాలను ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యాన్ని గుండెల నిండా నింపుకోవాలి. చాలినంత టెక్నాలజీని అందుబాటులో ఉంచుకోవాలి. అది అపాయకర వేళ సహకరించేలా చూసుకోవాలి. స్వతహాగా ప్రమాద సమయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం మంచిది. సాహసకృత్యాల సమయంలో భయాందోళనలకు గురి కాకూడదు.
ఒక్కో సమయానికి అవే ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. సాధించాలనే స్థిరత్వం, తపనలే చాలావరకు విజయం వైపు నడిపించగలవు.
కాబట్టి సాహసం చేయటం తప్పు కాదు. సాహసాలే విజయానికి సోపానాలు. అయితే తగు జాగ్రత్తలు తప్పనిసరి. చక్కటి ప్రణాళికతో, వ్యూహాత్మక నిర్ణయాలతో.. ముందుకు సాగితే.. మంచి ఫలితాలను సమాజానికి అందించవచ్చు. భావితరాలకు మార్గదర్శకులుగా నిలువవచ్చు.
-కె.ఆదిశేషారెడ్డి ( from ANDHRABHOOMI)