Friday, April 20, 2012

అలుపెరుగని పోరాటవాది మన చంద్రబాబు ( జన్మదినం సందర్భంగా )

ఏప్రిల్ 20, 1950 న చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో జన్మించిన తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు కు నేడు 61 సంవత్సరాలు నిండాయి. వందలాది పార్టీ అభిమానులు, నాయకులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
పుణ్యక్షేత్రమైన తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో, కనీసం గ్రామ పంచాయితీ అయినా కాని కుగ్రామం నారావారిపల్లెలో నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు 1950 ఏప్రిల్‌ 20వ తేదీన జన్మించారు చంద్రబాబు నాయుడు.
వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు చిన్నతనం నుంచే కష్టించి పనిచేసే వారు. చంద్ర బాబు కు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసారు చంద్ర బాబు.శేషాపురంలో ప్రాథమిక విద్య అనంతరం చంద్రబాబు సెకండరీ విద్యకోసం చంద్రగిరికి వెళ్ళారు. అక్కడ బంధువుల ఇళ్ళలో ఉంటూ పదవ తరగతి వరకూ చదివారు.

ఆ తర్వాత ఆయన చదువు తిరుపతికి మారింది. తిరుపతిలో హాస్టలు జీవితం. ఆయనలో నాయకత్వ లక్షణాలు అప్పటినుంచే వెలుగు చూశాయి. ఎస్‌.వి. ఆర్ట్స్‌ కాలేజీలో బిఏ ఎకనమిక్స్‌, పొలిటికల్‌ హిస్టరీ చదివే సమయంలోనే ఆయన గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేశారు. వినాయక సంఘం పేరిట సామాజికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు8. 1972 ప్రాంతంలో జనాన్ని సమీకరించి ఐదున్నర కిలోమీటర్ల పొడవున రోడ్డు వేయించారు. ఆధునిక దృష్టి అపారంగా ఉన్న ఆయన ఆ రోజుల్లోనే నారావారిపల్లెకు బుల్‌రోజర్లు తెప్పించారు. భూమిని చదును చేయించి పంటలు పండించారు. కష్టపడి పనిచేయడం, కొత్తదనం కోసం పరితపించడం ఆయనకు చిన్ననాటినుంచి అబ్బిన లక్షణాలు.

వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయన రాజకీయ జీవితానికి వేదిక అయింది. ఒకవైపు చదువు, వ్యవసాయం, సంఘసేవ, మరోవైపు రాజకీయ కార్యక్రమాలు. ఇలా ఆయన ఎంఏ పూర్తిచేశారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఆయన పాత్ర కీలకంగా ఉండేది. చంద్రగిరి బ్లాక్‌ యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా ఆయన 1977 దివిసీమ ఉప్పెన సమయంలో యువజన దళాన్ని వెంటబెట్టుకుని సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చదువు పూర్తయిన తరువాత రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్న చంద్రబాబు కు 1978 లో చంద్రగిరి స్థానం నుంచి పోటీచేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ ఎన్నికలలో విజయం సాధించిన చంద్రబాబు తన 29 వ ఏట టి అంజయ్య మంత్రివర్గంలో మంత్రిగా నియముతులయ్యారు.
ఒక చిత్ర షూటింగ్ సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పరిచయమయ్యారు చంద్రబాబు. అటు పిమ్మట రామారావు గారు తన కూతురును వివాహం చేసుకోవలసిందిగా సందేశం పంపారు. దీనికి సంమతమయిన చంద్రబాబు వివాహం భువనేశ్వరి తో మద్రాసులో జరిగింది.
తరువాత రామారావు గారు 1982 స్థాపించిన తెలుగుదేశంలో చేర వలసిందిగా చంద్రబాబు కు సందేశం పంపారు రామారావు గారు. దీనిని తిరస్కరించిన చంద్రబాబు కాంగ్రెస్ లోనే కొనసాగుతూ 1983 లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు. ఈ ఓటమి తరువాత కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం లో చేరారు.
తెలుగుదేశం లో చేరిన మొదటి సమయంలో నాదెండ్ల భాస్కరరావు వర్గం ముందు చంద్రబాబు కు అంతగా ప్రాముఖ్యం ఇచ్చే వారు కాదు.
నాదెండ్ల భాస్కరరావు రామారావు గారితో విభేదించిన తరువాత చంద్ర బాబు నాయుడు గారు పార్టీలో పట్టు సాధించటం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా కుప్పం స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలిచారు చంద్ర బాబు నాయుడు.
రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలనలో ఆర్ధిక మంత్రిగా కొనసాగారు చంద్రబాబు నాయుడు.1984లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినపుడు చంద్రబాబు సారథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం చారిత్రాత్మకం. ఆ తర్వాత ఆయన సామర్ధ్యాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు అప్పగించింది. 1989 ఎన్నికల్లో కుప్పం శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు చంద్రబాబు. ఆ ఎన్నికల ఫలితాల రీత్యా తెలుగుదేశం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. మళ్ళీ 1994 ఎన్నికల్లో తెలుగుదేశం విజయఢంగా మోగించింది. చంద్రబాబు రెవెన్యూ, ఆర్థిక శాఖలు నిర్వహించారు. అనంతరం 1995లో ఏర్పడ్డ సంక్షోభం చంద్రబాబుకు కొంత ఇబ్బంది తెచ్చిపెట్టింది. పార్టీ యంత్రాంగాన్ని పరిరక్షించే కర్తవ్యాన్ని చేపట్టారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పిడి జరిగాక చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.
ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు. పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రోజుకు 18 గంటలు తాను శ్రమిస్తూ, ఇతరులలో కష్టపడే తత్వాన్ని పెంపొందించారు. దేశంలోనే ఇన్షర్మేషన్‌ టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఇ-గవర్నెన్స్‌కు నాంది పలికారు. 2004 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓటమిపాలైనప్పటినుంచి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధ్వజమెత్తుతూ, ప్రభుత్వ వైఫల్యాలను సభలో, ప్రజల్లో నిరంతరం ఎండగడుతూ కృషి చేస్తున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజలమధ్య ఉంటూ వారికోసం పనిచేసే నేతగా ముందుకు సాగుతున్నారు.
( Collections from : Suryaa daily and some wiki articles )

1 comment:

  1. ఈ మధ్య మంచి వాళ్ళలో లోపాలని వెతుకుతూ చెడ్డ వాళ్ళలో హీరోఇజం చూసే బాపతు ఎక్కవయ్యారు. చక్కటి వ్యాసాన్ని అందించినందుకు కృతఙ్ఞతలు.

    ReplyDelete