Friday, April 6, 2012

ఆందోళన కలిగిస్తున్న మాల్దీవుల పరిణామాలు

హిందూ దూమహాసముద్ర ప్రాంతంపై మనదేశం ఎల్లప్పుడూ ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తూ వస్తున్న నేపథ్యంలో, ఆ ప్రాంతంలో చోటు చేసుకొనే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేయడం సహజం. 2012లో మాల్దీవుల్లో అధికార మార్పిడి జరగడం అటువంటి పరిణామాల్లో ఒకటి! దేశంలో కొనసాగిన ప్రజాందోళనలు ఉధృతమై చివరకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ పదవీత్యుతికి దారితీసాయి. 2008లో జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్ష పదవికి ఎన్నికయిన ఆయన ఎట్టకేలకు ప్రభుత్వ బాధ్యతలను ఉపాధ్యక్షుడు మహమ్మద్ వాహీద్ హసన్‌కు అప్పగించి, ఈ ఏడాది ఫిబ్రవరి 7న పదవినుంచి వైదొలగాడు. ఇటు భౌగోళికంగా లేదా జాతి పరంగా మాల్దీవులు అరబ్ ప్రపంచంలో భాగం కాదు. కానీ 2010లో ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా, ఈజిప్ట్, యెమెన్, ట్యునీసియా, మొరాకోదేశాల్లో చెలరేగిన ఉద్యమాల మాదిరి ఆందోళనలే ఇక్కడ కూడా చోటు చేసుకోవడం గమనార్హం. అప్పటి అధ్యక్షుడు నషీద్ పదవినుంచి తప్పుకోవడానికి ముందు చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే..అరబ్ దేశాల ఆందోళనల ప్రభావం ఇక్కడ ఉన్నదని ఎవరికైనా అవగతం కాక మానదు. ఉత్తర ఆఫ్రికా దేశాల మాదిరిగానే మాల్దీవుల్లో కూడా కొన్ని దశాబ్దాలుగా పురాతన శైలి నిరంకుశాధికారం కొనసాగింది. అయితే అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం దీవుల్లోని పౌర సమాజాల్లోని ‘ప్రజాబలం’ నిరంకుశ పాలనకు చరమగీతం పలికింది. ముఖ్యంగా రాజకీయ హక్కులు, పౌరులకే అధికారం అప్పగించడం, ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అవసరాన్ని ప్రజలు నొక్కి చెబుతూ ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం వాటిని ఉక్కుపాదంతో అణచివేయాలని చూసినమాట వాస్తవం.
అయితే మాల్దీవుల్లో చోటు చేసుకున్న పరిణామాలను చాలా జాగ్రత్తగా, నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉంది. మాల్దీవుల్లో అధికార మార్పిడికి కేవలం అరబ్ ఉద్యమాలు హిందూ మహాసముద్రం ప్రాంతంలోకి చొచ్చుకొని రావడమే కారణమన్న కోణంలో ఈ పరిశీలన కొనసాగాలి. కేవలం మూడు నెలలకు ముందు భారత్‌కు పొరుగు దేశంలో చోటు చేసుకున్న అతిపెద్ద పరిణామం..మనదేశ ప్రజల మనోఫలకాలపై గాఢమైన ముద్రను వేయలేకపోయింది. మరోమాటలో చెప్పాలంటే భారతీయులు ఈ సంఘటనను ఎప్పుడో మరచిపోయారు! దీనికి అంతటి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే అందుకు కారణం.
తన పదవీత్యుతి తర్వాత అధ్యక్షుడు నషీద్ విలేకర్లతో మాట్లాడుతూ..పోలీసులు, సైన్యం వత్తిడి వల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. భారత్ పరంగా ఆలోచిస్తే, మాల్దీవుల్లో చోటు చేసుకున్న పరిణామాలు కేవలం ఆ దేశ అంతర్గత వ్యవహారం. కానీ బయటి శక్తులు మాల్దీవుల్లో తమ పలుకుబడిని విస్తరించుకోవడానికి, అక్కడ తిష్ఠవేయడానికి చేసే యత్నాల్లో భాగంగానే ఈ మొత్తం నాటకాన్ని రక్తి కట్టించాయా? అనే ప్రశే్న మనకు ఆందోళన కలిగించే అంశం. భౌగోళికంగా అత్యంత సమీపంలో ఉన్న మాల్దీవులతో సహజంగానే భారత్ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. అన్ని సందర్భాల్లో కూడా మనదేశం, మాల్దీవులతో స్నేహం విషయంలో ప్రత్యేకతను కనబరుస్తూనే వచ్చింది. వివిధ దేశాల్లో చోటు చేసుకున్న అరబ్ ఉద్యమాలను భారత్ ఎల్లప్పుడూ, ఆయా దేశాల అంతర్గత వ్యవహారంగా పరిగణిస్తూ వచ్చింది. అయితే అరబ్ ఉద్యమాల పుణ్యమాని ఆయా దేశాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలతో సంబంధాలు నెరపే విషయంలో భారత్ కొరుకుడు పడని సమస్యను ఎదుర్కొంటున్నది. నియంతల కబంధ హస్తాలనుంచి తమ దేశాలకు విముక్తిని కలిగించిన తర్వాత, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో విజయం సాధించిన ఆయా పార్టీల వారు అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ, వారిలో సెక్యులర్ భావాలు లేకపోవడం భారత్ ఆందోళనకు కారణం! ముఖ్యంగా అవి ఇస్లామిక్ సిద్ధాంతాలకు అనుగుణంగా..అంటే సలాఫి-వాహబీ ఛాందసవాదం వైపుకు మొగ్గు చూపుతుండటం భారత్‌కు ఇబ్బంది కారకమవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనదేశం వంటి సెక్యులర్ దేశాల్లో, బహుళ సంస్కృతులు పరిఢవిల్లుతున్నాయి. విభిన్న మతాలవారు సహజీవనం కొనసాగిస్తున్న సమాజం మనది. ఈ నేపథ్యంలో, భారత్ వంటి ప్రజాస్వామిక దేశాల్లోని కొన్ని ఇస్లామిక్ వర్గాలు, జిహాదీ సంస్థలు చేస్తున్న దుష్ప్రచార ప్రభావానికి తేలిగ్గా లోబడే అవకాశాలు మెండు. ముఖ్యంగా పాకిస్థాన్ వంటి దేశాల్లోని కోవర్ట్ ఇంటెలిజెన్స్ సంస్థల సహాయంతో జిహాదీ సంస్థలు చేసే ఆగడాలతో మనదేశం ఎంతో సతమతమవుతున్నది! అందువల్ల ప్రస్తుతం అరబ్ దేశాల్లో చోటు చేసుకున్న ఉద్యమాల అనంతరం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వాతావరణం భారత్‌కు ఏమాత్రం సానుకూలం కాదు! అటువంటి పరిస్థితుల్లో, మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ పదవీత్యుతుడు కావడానికి ముందు చోటు చేసుకున్న వివిధ ప్రజాందోళనలను ఎవరు పరీక్షిస్తారు? లేదా పట్టించుకునేదెవరు?
ఈ నేపథ్యంలో మాల్దీవుల్లో చోటు చేసుకున్న రాజకీయ అస్థిరత, పౌర ఉద్యమాలను..దక్షిణాసియా, హిందూ మహాసముద్రం ప్రాంతంలో వేగంగా విస్తరిస్తున్న రాడికల్ ఛాందసవాదం దృక్కోణంలో విస్తృత ప్రాతిపదికన పరిశీలించాల్సి ఉంది. భౌగోళికంగా మాల్దీవులు ఒంటరిగా, వ్యూహాత్మకంగా బాహ్య శక్తులు తేలిగ్గా ప్రవేశించి తిష్ఠవేసేందుకు అనువుగా ఉన్నాయి. దీనికి నిదర్శనంగా 1988లో జరిగిన సంఘటననే ఉదాహరణగా చెప్పవచ్చు. పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం అనే తీవ్రవాద సంస్థకు చెందిన మిలిటెంట్లు, అప్పట్లో మాల్దీవుల ప్రభుత్వాన్ని పడగొట్టి, ద్వీపాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. మాల్దీవుల ప్రభుత్వం భారత్ సహాయాన్ని అర్థించింది. తక్షణమే భారత సైన్యానికి చెందిన పారాచూట్ బెటాలియన్‌ను అక్కడికి నాటి కేంద్ర ప్రభుత్వం పంపింది. దీనికి ఆపరేషన్ కాక్టస్‌గా పేరుపెట్టారు.
మరి అటువంటి ప్రయత్నాలు మళ్ళీ జరగకూడదనేంలేదు. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ వంటి కోవర్ట్ సంస్థల మద్దతుతో రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు ఈ ద్వీపాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించే అవకాశాలను కొట్టిపారేయలేం. నేరుగా ప్రభుత్వాన్ని పడగొట్టే చర్యల వల్ల, అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందువల్ల, ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి, దేశాన్ని ఆందోళనలతో అట్టుడికించడం ద్వారా,పాలక ప్రభుత్వాన్ని అధికారంనుంచి తప్పించవచ్చు. తర్వాత చట్టబద్ధంగా జరిగే ఎన్నికల్లో రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు అధికారాన్ని హస్తగతం చేసుకొనే విధంగా ప్రణాలిక సిద్ధం చేసి అమలు జరపవచ్చు.
నిజానికి హిందూ మహాసముద్రం, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా, గల్ఫ్ దేశాలకు వాణిజ్యపరంగా ఎంతో ఉపయోగపడుతున్నది. అందువల్లనే ఈ మార్గంలో రవాణా నౌకల రద్దీ అధికంగా ఉంటోంది. అంతే కాదు ఈ సముద్ర తీరంలో చాలా చిన్న దేశాలు ఉండటం వ్యూహాత్మక ప్రాధాన్యతను మరింత విస్తృతం చేసింది. ముఖ్యంగా వాటిల్లో అందుబాటులో ఉండే వనరులు, భౌగోళిక కోణంలో కూడా ఆయా దేశాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగివుండటం విశేషం. అరేబియా సముద్రం ఎగువ భాగంలో ముఖ్యంగా హార్న్ ఆఫ్ ఆఫ్రికా చుట్టుపక్కల ప్రాంతాలు, పూర్వకాలపు బార్బరీ తీర ప్రాంతం మాదిరిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కేంద్ర స్థానాన్ని ఆక్రమించే సోమాలియా సముద్రపు దొంగలకు నిలయంగా మారిపోయింది. ప్రస్తుతం సోమాలియాలో ఏవిధమైన ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో అరాచకం తాండవిస్తోంది. అంతేకాదు అల్ సాహెబ్ జిహాదీ గ్రూపులు ఇక్కడ యదేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
ఇక్కడి సముద్రపు దొంగల స్థావరాలను సమూలంగా నాశనం చేయాలంటే.. పెద్ద ఎత్తున వాయు, భూతల దాడులు జరపాల్సి ఉంటుంది. ఇందుకు ఏ దేశానికి చెందిన ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. సోమాలియాకు చెందిన ఈ మిలిటెంట్ గ్రూపులు అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఇప్పటి వరకు కేవలం ఇథియోపియా మాత్రమే ప్రయత్నించింది. ఈ యత్నాలు ఏవీ సఫలీకృతం కాలేదు సరికదా, ఈ సముద్రపు దొంగల సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి, అంతర్జాతీయ సహకారాన్ని పొందడంలో కూడా విఫలమయింది.
ఈ సోమాలీ పైరేట్లు ఇక ముందు..మరింత ఆధునిక సాయుధ సంపత్తిని సమకూర్చుకొని, సైనిక శిక్షణ పొందే రోజులు కూడా ఎంతో దూరంలోలేవు! ఇందుకు కోవర్ట్ ఏజెంట్లు లేదా అల్ ఖైదా, తాలిబన్ సంస్థలకు చెందిన జిహాదీలు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. ఫలితంగా అల్ షబాబ్ తూర్పు ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రభుత్వాలకు మాత్రమే కాదు ఇతర ప్రాంతాలకు చెందిన దేశాలకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇదే సమయంలో హిందూమహాసముద్ర ప్రాంతంలోని ద్వీప సమూహాలు పూర్తి స్థాయిలో ఇస్లామిక్ ఎమిరేట్స్‌గా మారిపోతాయని కూడా చెప్పడం సాధ్యం కాదు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో భారత్ తన సమీప ప్రాంతాల విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ప్రస్తుతం మాల్దీవుల్లో చోటు చేసుకున్న మార్పులు, భవిష్యత్ పరిణామాలకు సూచనగా అర్థం చేసుకోవాలి. అందుకు తగినవిధంగా భారత్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వ్యూహాత్మకంగా మెలగగలిగితే హిందూ మహాసముద్రంలో, భారత్ తన ప్రయోజనాలను పరిరక్షించుకోగలుగుతుంది.

  • -శంకర్ రాయ్‌చౌధురి in Andhrabhoomi

No comments:

Post a Comment