Thursday, April 5, 2012

బడుగుల ఆశాజ్యోతి ! (నేడు జగ్జీవన్‌రామ్ 104వ జయంతి)

బీహార్ రాష్ట్రంలో అట్టడుగు కులంలో జన్మించి భారత రాజకీయాల్లో అత్యున్న తస్థాయికి ఎదిగిన అరుదైన నేత బాబూ జగ్జీవన్‌రామ్. విద్యార్థి దశలోనే సామాజిక సేవా కార్యక్రమాలతో గుర్తిం పుపొంది, మూడు పదులు కూడా నిం డని వయసులో బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికై బడుగుల ఆశాజ్యోతిగా వెలుగొందాడు. 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని చాంద్వా గ్రామంలో చమార్ కులానికి చెందిన బసంతీదేవి, శోభిరామ్ దంపతులకు జన్మించాడు. కలకత్తా, బనారస్ విశ్వవిద్యాలయాల నుంచి ఉన్నతవిద్యలో పట్టాలు పొందారు.

1934లో బీహార్‌లో సంభవించిన భూకంప బాధితులను ఆదుకోవడంలో జగ్జీవన్‌రామ్ చూపిన చొరవ అనన్యమైనది. అనారోగ్యంతో మొదటి భార్య కన్నుమూయడంతో, 1935లో కాన్పూర్‌కు చెందిన ఇంద్రాణితో రెండో వివాహం జరిగింది. బాబూ రాజేంద్రప్రసాద్, మహాత్మాగాంధీ ఆశీస్సులతో భారత స్వాతంత్య్రోద్యమంలోనూ, జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లోనూ బాబూ జగ్జీవన్‌రామ్ చురుగ్గా పాల్గొన్నారు. 1946లో నెహ్రూ మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా ప్రమాణం చేశారు. 1950లో జెనీ వాలో జరిగిన ప్రపంచ కార్మిక మహాసభల్లో ఆయన పాల్గొనడం విశేషం. 

1957లో కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన జగ్జీవన్‌రామ్, తదనంతరం వ్యవసాయశాఖ మంత్రిగా కొనసాగారు. 1970లో అఖిల భారత కాంగ్రెస్‌పార్టీ ఆధ్యక్షునిగా వ్యవహరించారు. 1971లో జగ్జీవన్‌రామ్ కేంద్ర రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో ‘బంగ్లాయుద్ధం’ జరిగి పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడివడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1969లో కాంగ్రెస్ పార్టీ నుంచి భారత రాష్ట్రపతి అభ్యర్థిగా తొలుత నీలం సంజీవరెడ్డిని ప్రకటించిన ఇందిరాగాంధీ, తరువాత బెంగళూరులో జరిగిన పార్టీ మహాసభలో జగ్జీవన్‌రామ్‌తో వీవీ గిరి పేరును ప్రతిపాదింపచేసి, ‘ఆత్మప్రబోధం’ ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

1975 ‘ఎమర్జెన్సీ’ అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి ‘కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ’ పేరుతో జగ్జీవన్‌రామ్ కొత్త పార్టీని ప్రారంభించారు. 1977 ఎన్నికల్లో జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన జనతాపార్టీతో పొత్తు పెట్టుకుని అఖండ విజయాన్ని సాధించి, తదనంతరం భారత ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలందిం చారు. కేంద్ర ప్రభుత్వంలో కార్మిక, రైల్వే, వ్యవసాయ, సమాచార శాఖల మంత్రిగా జగ్జీవన్‌రామ్ రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. 

పరిపాలనా దక్షునిగా, అట్టడుగు వర్గాల అసాధా రణ నేతగా భారతీయ సమాజ పరివర్తనలో విలక్షణమైన పాత్ర పోషించిన జగ్జీవన్‌రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభావం తనపై ఎంతగానో ఉందని సవినయంగా ప్రకటించడం గమనార్హం. 1948లో ఒకసారి, 1976లో మరోసారి హైదరాబాద్‌లో జరిగిన అణ గారిన వర్గాల మహాసభల్లో పాల్గొని తన సందేశాన్ని తెలుగు ప్రజలకు వినిపించారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. జగ్జీవన్‌రామ్ 1986 జూలై 6న తుది శ్వాస విడిచారు. నేటితరం దళిత, బహుజన నేతలకు ఆయన జీవితం అనుసరణీయం.

గుండాల రాకేష్ నర్సరావుపేట, గుంటూరు జిల్లా ( From Sakshi blogs)

No comments:

Post a Comment