Friday, March 16, 2012

ఉప ఎన్నికల ప్రచారానికి నేడు తెర- కోవూరులో ధన ప్రవాహం


రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడనుంది. రాష్ట్రంలోని ఏడు స్థానాలకు ఈ నెల 18న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా కోవూరును మినహాయిస్తే.. మిగిలిన ఆరు స్థానాలు తెలంగాణ ప్రాంతంలోనివి. ఇప్పటివరకు ఈ స్థానాల్లో ప్రచారం హోరెత్తింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారహోరుకు బ్రేక్ పడనుంది. కాగా కోవూరు ఉప ఎన్నికను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలో గెలుపు చాలా ముఖ్యం. కోల్పోయిన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడమో లేక YSRకాంగ్రెస్ పార్టీయే తమ పార్టీ కంటే ఆధిపత్యంలో ఉందని ఒప్పుకోవడమో చేయాల్సిన సమయమిది. ఈ ఎన్నికలో ఏ పార్టీ గెలిసినా మిగతా రెండు పార్టీలపై ప్రభావం తప్పకుండా ఉంటుంది.
ఇప్పటికి పూర్తయిన అన్ని సర్వేలూ YSRకాంగ్రెస్ కే అనుకూలమని చెప్పడంతో TDP,కాంగ్రెస్ లలో గుబులు మొదలైంది. దీంతో పోలింగ్ గడువు దగ్గర పడటంతో ప్రలోభాల జాతరకు రాజకీయ నాయకులు తెర తీశారు. గత రెండురోజుల నుంచి ఈ క్రమం ఊపందుకోవడం గమనార్హం. ప్రధాన అభ్యర్థులంతా ఒక్కో ఓటుకు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు పంపిణీ చేసే పనిలో ఉన్నారు. ఉప ఎన్నిక బరిలో మొత్తం 14 మంది పోటీ పడుతుండగా ప్రధాన పోటీ టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్యనే కేంద్రీకృతమై ఉంది. గెలుపుధీమాతో ఉన్న ఓ పార్టీకి డబ్బుకు కొదవ లేదని, భారీ స్థాయిలో డబ్బు పంచుతారని ఓటర్లు ఎదురుచూస్తుంటే రెండువందల రూపాయల వంతున మాత్రమే పంపిణీ చేశారు. మరో అభ్యర్థి మూడొందల రూపాయలు, పురుష ఓటర్లైతే అదనంగా రెండు క్వార్టర్ మద్యం సీసాలు సరఫరా చేయసాగారు. ఇక గెలుపోటముల నడుమ ఊగిసలాడుతున్న ఇంకో అభ్యర్థి ఏకంగా వెయ్యి రూపాయల వంతున అందించడానికి శ్రీకారం చుట్టారు. స్వల్ప తేడాతోనైనా పరిస్థితి అనుకూలపరచుకోవాలనే పట్టుదలతో ఓటుకు వెయ్యి ఇచ్చేందుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది. దీంతో తమదే గెలుపున్న ధీమాతో ఉన్న పార్టీ వర్గీయులు ఆలోచనలో పడ్డారు. ముందు తక్కువగా అందజేసి మరోవిడతగా మిగిలిన సొమ్ము ఇవ్వాలని గెలుపుధీమాతో ఉన్న అభ్యర్థి వర్గీయులు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో తొలుత పంపిణీ చేపట్టారు. కేవలం రెండువందల రూపాయలు మాత్రమే అందజేస్తుండటంతో ఓటర్ల నుంచి విముఖత వ్యక్తమైంది. ఈ సందర్భంలో నాయకులు చెప్పిన మాటలు వింత గొలిపాయి. తమ పార్టీ అధినేత స్థానికంగా పర్యటిస్తున్నందున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకే ఈ మొత్తమని సర్ది చెప్పారు. గెలుపుతథ్యమని, ఈ నియోజకవర్గంలో తమ వాస్తవ సామర్థ్యం తేల్చుకునేందుకే భారీ నజరానాలకు స్వస్తిపలికామంటున్నారు. పోలింగ్ రోజున పనికి వెళ్లకుండా ఓటు వేసేందుకు వస్తున్నందున నష్టపోయే కూలికి ప్రత్యామ్నాయంగా రెండువందల రూపాయలు అందజేస్తున్నట్టు వివరిస్తున్నారు. మత్స్యకారుల నివాసిత ప్రాంతాలైన పట్టపుపాళాల్లో తమ దురాయి (ఓట్లన్నీ ఒకరికే వేసే కట్టుబాటు) ప్రకారం అభ్యర్థుల నుంచి భారీగానే మొత్తాలు స్వీకరించారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని 19 పట్టపుపాళాల్లో 15వేల వరకు మత్స్యకార్ల ఓటింగ్ ఉన్నట్లు లెక్కలు చెపుతున్నాయి. ఒక పట్టపుపాళెంలో జరిగిన దురాయికి సంబంధించిన వివరాలు అనధికారికంగా వెల్లడిస్తున్నారు. అక్కడ ఆరువందల వరకు ఓటింగ్ ఉండగా ఒక పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను 22లక్షల రూపాయలకుపైగానే ఆ పార్టీ ప్రతినిధులు ముట్టచెప్పారు. ఓటుకు మూడువేల రూపాయల వంతున అందించడంతో సహా పెద్దకాపు ప్రత్యేక ఖర్చులు, మద్యానికి మరికొంత సొమ్ము లెక్కగట్టి ఇస్తుండటం విశేషం

No comments:

Post a Comment