Saturday, December 29, 2012

తెరపైకి మళ్లీ మూడవ కూటమి

దేశంలో మళ్లీ మూడవ కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు జనతాదళ్‌(ఎస్‌) నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ప్రకటించారు. దాంతో ఈ అంశపై చర్చకు తెరతీసినట్లైంది. మన దేశంలో మూడవ కూటమి ఏర్పడటం అంటే మాటలుకాదు. దానికి కాంగ్రెస్, బిజెపిలను వ్యతిరేకించడం ఒక్కటే సరిపోదు. భావసారూప్యతతోపాటు విధానపరమైన ఏకాభిప్రాయం కూడా కావాలి. 2009లో కూడా మూడవ కూటమి ఏర్పాటుకు వామపక్షాలతోపాటు దేవెగౌడ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా కృషి చేసి విఫలమయ్యారు. మళ్లీ ఇప్పుడు కూడా దేవెగౌడ ఈ అంశం పట్ల ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు అవినీతి, అక్రమాలు, కుంభకోణాల్లో మునిగితేలుతున్నాయని, దీంతో ఆ పార్టీలపై ప్రజలు విసిగుచెందారని ఆయన చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది ఆయన అభిప్రాయం. మూడవ కూటమి ఏర్పాటుకు ఇదే మంచి సమయం అని ఆయన అన్నారు. 

దేవెగౌడ్ చెప్పినట్లు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుపిఏ ప్రభుత్వం భారీ కుంభకోణాల ఊబిలో చిక్కుకుంది. దానికితోడు అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీసెల్, గ్యాస్, రైలు ఛార్జీలు.......అన్నీ పెంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. యుపిఏ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా అందుకు భిన్నంగా ఏమీలేదు. బిజెపి అధికారంలో ఉన్న కర్ణాకట పరిస్థితి అందరికీ తెలిసిందే. గుజరాత్ లో మోడీ హవాతో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ లో ఘోరంగా ఓడిపోయింది. ఇతర రాష్ట్రాలలో కూడా ఆ పార్టీ అంత బలంగా ఏమీలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రధాని అభ్యర్థి విషయంలో ఆ పార్టీలోనూ, ఎన్ డిఏ కూటమిలోనూ అభిప్రాయభేదాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ప్రజలు మూడవ ప్రత్యామ్నాయంవైపు చూస్తున్న మాట వాస్తవం. అయితే దేవెగౌడ్ గత చరిత్ర తెలిసినవారెవరూ ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయని అనుకోరు. బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించిన దేవెగౌడ గతంలో తన కుమారుడు కుమారస్వామి బిజెపితో పొత్తు కుదుర్చుకుంటే రాజీపడ్డారు. ఆ తరువాత తన కుమారునికి మంత్రి పదవి కోసం మూడవ కూటమికి గుడ్‌బై చెప్పి యుపిఎకి మద్దతు పలికారు. అటువంటి నిలకడలేని రాజకీయ వేత్త ప్రయత్నాలు ఫలించే అవకాశాలు చాలా తక్కువ. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులలో వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలతో మూడవ కూటమి ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై నడిపించడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించిన్పటికీ ఫలితం దక్కలేదు. 

ఈ 'మూడవ' అనేదాన్లో మరో అంశం చర్చించవలసి ఉంది. కాంగ్రెస్, బిజెపియేతర పక్షాల కూటమి అనేది ఒకటైతే, వామపక్షాల ఆధ్వర్యంలో మూడవ ఫ్రంట్ అనేది మరొకటి వినస్తుంది. దీనినే విధాన ప్రత్యామ్నాయం అంటారు. వామపక్షాలు అంటే విధాన పరమైన అంశాలకు ప్రధాన్యత ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్‌-బిజెపి యేతర పార్టీలను కలుపుకొని మూడవ కూటమి ఏర్పాటు చేసి, గత ప్రభుత్వాల విధానాలనే అవలంభించడం తమ ఉద్దేశం కాదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అలా కాకుండా కార్యక్రమ ఆధారిత విధాన ప్రత్యామ్నాయానికి తాము కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సోషలిజంను అంగీకరించాలనే షరతు విధించకపోయినప్పటికీ వారు భూ సంస్కరణలు, ధరల అదుపు, తాగు నీరు, విద్య, వైద్యం ప్రైవేటీకరణ నిలుపుదల, గనులు, నీరు, భూములు, అడవుల లూటీ నిరోధం, శక్తివంతమైన లోక్‌పాల్‌ చట్టం, తదితర అంశాలతో పాటు, విదేశాంగ, ఆర్థిక విధానాలపై స్పష్టతతో కూడిన ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తారు. ఈ ప్రత్యామ్నాయ ప్రయత్నాలలో ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ క్రమంలో జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి, మూలాయం సింగ్ యాదవ్, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, మన రాష్ట్రం నుంచి వైఎస్ జగన్మోహన రెడ్డి, చంద్రబాబు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే, మన దేశంలో మూడవ ఫ్రంట్ కు అవకాశమేలేదని చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. గతకాల అనుభవాలే వారితో ఆ మాటలు అనిపిస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెసేతర, బిజెపియేతర ఫ్రంట్‌ ఏర్పడితే అది ఎంతో కాలం నిలవదని గతంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ నిరూపించింది. యునైట్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా ఇద్దరు ప్రధాను(హెచ్‌.డి.దేవెగౌడ,ఐ.కె.గుజ్రాల్‌)లను మార్చింది. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, వామపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన 'పీపుల్స్‌ ఫ్రంట్‌' కూడా ఎంతోకాలం నిలవలేదు. ఈ నేపధ్యంలో 'భారత రాజకీయాల్లో మూడవ ఫ్రంట్‌ అత్యంత శాశ్వత ఎండమావి' అని ఏఐసిసి అధికార ప్రతినిధి మనీష్‌ తివారీ వ్యాఖ్యానించారు. మూడవ ఫ్రంట్‌కు అవకాశమే లేదన్న అభిప్రాయాన్ని జెడి-యు నేత శివానంద తివారీ వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల తరువాత ఏర్పడబోయే ప్రభుత్వాన్ని నిర్ణయించేది బిజెపి నేతృత్వంలోని కూటమి గాని, కాంగ్రెస్‌ పార్టీగాని అవుతుందని ఆయన అన్నారు. 

పార్టీల మధ్య విధానపరమైన సారూప్యత, ప్రజా సంక్షేమం పట్ల అంకితభావం, కలసి పనిచేయాలన్న బలమైన వాంఛలేకపోతే గత ఎన్నికల సమయంలో మన రాష్ట్రంలో ఏర్పడిన మహాకూటమిలా ఉంటుంది పరిస్థితి. ఆ మహాకూటమికి కాంగ్రెస్ ను ఓడించడమే ఏకైక లక్ష్యం. అంతకు మించిన భావసారూప్యత వాటిమధ్య ఏదీలేదు. అందుకే ఎన్నికలు ముగిసేవరకు కూడా ఆ మహాకూటమి నిలబడలేదు. రాజకీయ పార్టీల నిలకడ లేని వైఖరికి అది నిదర్శనం. ఆ మహాకూటమిని భవిష్యత్ లో అందరూ ఒక గుణపాఠంగా తీసుకోవలసిన అవసరం ఉంది.

No comments:

Post a Comment