Friday, December 21, 2012

జనవరి 18 లోగా కాంగ్రెస్‌ ప్ర్రక్షాళన !

న్యూఢిల్లి: కాంగ్రెస్‌ పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, పునర్‌ వ్యవస్థీకరించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెల్లడించారు. జనవరి 18, 19 తేదీల్లో జైపూర్‌లో నిర్వహించనున్న మేధోమథనం సదస్సు కంటే ముందే కాంగ్రెస్‌ పార్టీ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని సోనియా గాంధీ సూచనప్రాయంగా తెలిపారు. పార్టీలో రాహుల్‌గాంధీకి ఎలాంటి పాత్ర పోషించనున్నారు, ఏపదవి అప్పగించను న్నారా అన్న మీడియా ప్రతినిధులు ప్రశ్నకు, రాహుల్‌ అభిప్రా యాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని సోనియా స్పష్టం చేశారు.
హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లిd ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం పట్ల పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతోషం వ్యక్తంచేశారు. గుజరాత్‌లో కూడా మంచి ఫలితాలు సాధించామని ఆమె పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని సోనియా స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ సీఎం రేసులో ముందువరుసలో ఉన్నారు.
గుజరాత్‌ ఫలితాలు కేంద్రంలో అధికారంలోని యుపీఏ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు కల్పించాయి. 2014 ఎన్నికలకు యూపీఏ సన్నద్ధమవుతుండగా, గుజరాత్‌ ఫలితాలు తీవ్ర నిరాశపరిచాయనే అభిప్రాయం కాంగ్రెస్‌ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. 2013లో తొమ్మిది రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లిd ఎన్నికలపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, మరికొన్నింటిలో ప్రతిపక్షంలో ఉంది. రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికల్లో కాంగ్రెస్‌ పాగా వేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్‌ అధిష్టానం చింతన్‌ బైఠక్‌, మినీ మేధోమథనం, మేధో మథనం పేరుతో సదస్సులు నిర్వహిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. ఇటీవల సూరజ్‌ ఖండ్‌లో మినీమేధో మథనం సదస్సు నిర్వహించి, రాహుల్‌ గాంధీ నేతృత్వంలో 2014 ఎన్నికల ప్రచార బాధ్యతల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. ఓ వైపు రాహుల్‌గాంధీని భవిష్య ప్రధానిగా ప్రచారం చేస్తూ, మరోవైపు పార్టీలో రాహుల్‌ క్రియాశీలక బాధ్యతలు (కార్యనిర్వాహక అధ్యక్షుడు) అప్పగించడానికి యత్నాలు సాగుతున్నాయి. 2013 జనవరి 18, 19 తేదీల్లో జైపూర్‌లో నిర్వహించనున్న మేధోమథన సదస్సులో రాహుల్‌కు క్రియాశీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీవర్గాల సమాచారం. త్వరలో పార్టీ ప్రక్షాళన చేస్తున్నట్లు అధినేత్రి సోనియాగాంధీ చేసిన ప్రకటన ప్రాధాన్యత ఏర్పడింది.

No comments:

Post a Comment