Sunday, July 31, 2016

హైదరాబాద్‌ విమానాశ్రయ ప్రాంగణంలో రెండో గోదాము ఏర్పాటు చేస్తున్న అమెజాన్

వెబ్‌సైట్‌లో వినియోగాదారుల కొనుగోళ్లకు అనుగుణంగా వారికి వస్తువులను బట్వాడా ఉంచేందుకు కీలకమైన ప్రదేశాల్లో అమెజాన్‌ గోదాములను (ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు) ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 21 గోదాములు కలిగిన అమెజాన్‌ రానున్న పండుగల సీజన్‌ను దృష్టి పెట్టుకుని మరో 6 గోదాములను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా హరయాణలోని సోనిపట్‌లో 2,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గోదామును ప్రారంభించింది. ఇది కంపెనీకి 22వ గోదాము అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రెండో గోదామును ఏర్పాటు చేస్తోంది. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణంలో దీన్ని సిద్ధం చేస్తున్నారని, నెల రోజుల్లో ఈ గోదామును ప్రారంభించే వీలుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ గోదాముపై అమెజాన్‌ ఏ మేరకు పెట్టుబడి పెడుతోంది, ఎంతమందికి ఉపాధి లభించే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

గత ఏడాది జూన్‌లో దేశంలోనే అతిపెద్ద గోదామును హైదరాబాద్‌కు సమీపంలోని కొత్తూరు (మహబూబ్‌ నగర్‌ జిల్లా)లో ఏర్పాటు చేసింది. 2,80,000 చదరపు అడుగుల్లో దీన్ని అభివృద్ధి చేసింది. తాజాగా విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న గోదాము ఇంతకంటే పెద్దదని తెలుస్తోంది. భౌగోళికంగా హైదరాబాద్‌ కేంద్రంలో ఉండడం, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో ఇ-కామర్స్‌ విక్రయాలు ఆకర్షణీయంగా పెరుగుతుండడం, పన్నుపరమైన వెసులుబాటు వంటి సానుకూల అంశాల కారణంగా ఇప్పటికే ఒక గోదాము ఉన్నప్పటికీ.. అమెజాన్‌ రెండో ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గోదాములతోపాటు హైదరాబాద్‌లోని గచ్చీబౌలిలో 10 ఎకరాల్లో అమెజాన్‌ ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈఏడాది మార్చిలో దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2019 నాటికి ఇది సిద్ధం అవుతుందని భావిస్తున్నారు. భారత్‌లో అమెజాన్‌కు ఇది అతిపెద్ద ప్రాంగణం అవడమే కాక అమెరికాకు వెలుపలు ఉన్న అతిపెద్ద ప్రాంగణం కూడా ఇదే అవుతుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. అమెజాన్‌ బ్యాక్‌ ఆఫీస్‌ కార్యకలాపాలను ఈ కేంద్రం ద్వారా నిర్వహిస్తారు. అనేక నిపుణుల బృందాలు ఇక్కడ పని చేస్తాయి.

No comments:

Post a Comment