Tuesday, June 7, 2016

సత్యానాదెండ్లకు చంద్రబాబే స్పూర్తి అట !

చంద్రబాబు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అన్ని ఇజాలకన్నా టూరిజమే గొప్పదని, చరిత్ర చదువుకోవడం వృధా అని చెప్పినపుడు కొందరు ఆశ్చర్యపోయారు… మరికొందరు నవ్వుకున్నారు. కానీ ఆయన చెప్పింది నిజమే. చరిత్ర తెలియడంవల్ల చాలా కష్ట, నష్టాలుంటాయని ఆయన భావించింది నిజమే.
ఉదాహరణకు నావల్లే సత్యానాదెండ్ల మైక్రోసాఫ్ట్‌ సీఇఓ అయ్యాడు. నా ఇన్‌స్పిరేషన్‌తోనే ఐటీ రంగంలో నేను సాధిస్తున్న విజయాల స్ఫూర్తితోనే ఆయన ఐటీవైపు వెళ్లాడు అని ఈమధ్య చంద్రబాబు ఊదరగొడుతున్నాడు.
చరిత్రలోకి వెళితే ఈయన ముఖ్యమంత్రి కాకముందే సత్యానాదెండ్ల మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగి. 1995 ఆగష్టులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 1992లో మైక్రోసాఫ్ట్‌లో జాయిన్‌ అయిన సత్యానాదెండ్లకు ఏవిధంగా స్ఫూర్తినిచ్చాడో తలగింజుకున్నా అర్ధంకాదు. చంద్రబాబు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సాధించిన అద్భుతాలను చూసి సత్యానాదెండ్ల సివిల్ సర్వీస్‌వైపు కాకుండా ఇంజనీరింగ్‌ మీద దృష్టిపెట్టి 1988లోనే ఎలా ఇంజనీరింగ్‌వైపు వెళ్లాడో, 1990లోనే అమెరికావెళ్లి ఎలా ఎంఎస్‌ చేసాడో తల బద్దలు కొట్టుకున్నా అర్ధం కాదు. అందుకే చంద్రబాబుకు గతం అన్నా, చరిత్ర అన్నా ఇష్టం లేదు.
నావల్లే హైదరాబాద్‌ ప్రపంచ పటంలో గుర్తింపుపొందిందని, ఐటీ కంపెనీలు తనను చూసే హైదరాబాద్‌కు వురుకులు పరుగులు పెట్టాయని అప్పుడూ..ఇప్పుడూ.. ఎప్పుడూ చెప్పే చంద్రబాబు ఈ రెండేళ్లనుంచి ఆంధ్రాకు ఒక కంపెనీకూడా ఎందుకు రాలేదో చెప్పడు. అదేమంటే భజన బృందాలు ఐటీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి ఫెయిల్యూర్‌గా చిత్రీకరిస్తాయి. ఇది నిజంగా ఐటీ మంత్రి ఫెయిల్యూరే అయితే గతంలో హైదరాబాద్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వచ్చిన ఐటీ సక్సెస్‌కూడా అప్పటి ఐటీ మంత్రికి చెందాలికదా..! ఏదైనా సక్సెస్‌ అయితే తన ఖాతాలోకి, ఫెయిల్యూర్‌ అయితే ఇతరుల ఖాతాలోకి. అంతేనా?
Source: http://teluguglobal.com/chandrababu-comments-on-satya-nadella/

No comments:

Post a Comment