Friday, January 6, 2012

ఆఫీసు మర్యాదలు ముఖ్యం

బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇతర పనులపై కానీ ఆఫీసు సమయాల్లో కలవడం మామూలే. అయితే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే సమయంలో కలవాలనుకుంటే ముందుగా ఫోన్ చేయడం, అపాయింట్‌మెంట్ తీసుకోవడం లాంటి కనీస బాధ్యతలు నిర్వహించడం అవసరం. ఇలా చేయడంవలన పనులకు అవాంతరాలు ఏర్పడకుండా సకాలంలో సవ్యంగా జరుగుతాయి.
ఎవరినైనా కలవడానికి వాళ్ళ ఆఫీసుకు వెళ్ళడానికి ముందు ఫోన్ చేసి, వారు పనితో బిజీగా ఉన్నదీ, లేనిదీ తెలుసుకుని వెళ్ళడం మంచిది. లేదంటే అక్కడ వెయిట్ చేయడంవల్ల సమయం వృధా అవుతుంది.
కలవడానికి వస్తానని అపాయింట్‌మెంట్ తీసుకున్నపుడు వస్తానన్న టైముకు సరిగ్గా వెళ్లాలి. ఇచ్చిన టైమ్‌కు వారిని కలవకపోతే సదభిప్రాయం ఏర్పడదు.
ఇతరులను కలవడానికి వెళ్లినపుడు వారు విధి నిర్వహణలో ఉంటే వారి పనికి అంతరాయం కలిగించకుండా కొంచెం సమయం ఉండటానికి సిద్ధపడి వెళ్ళాలి. వేరే పనులు ఉన్నాయి, వేరే వ్యక్తులను కలవాలని మీరు తొందరపడి, ఎదుటివారిని తొందరపెట్టకూడదు.
పనిమీద వెళ్లినపుడు ఎంతవరకు అవసరమో, అంతవరకే మాట్లాడాలి. మీరు ఖాళీగానే ఉన్నారు కదా! అని ఎదుటివ్యక్తుల సమయాన్ని వృధా చేయకూడదు.
పనిమీద బయటకు వెళ్ళినపుడు బ్యాగులో ఎప్పుడూ పెన్ కానీ, పెన్సిల్ కానీ ఉండాలి. ఇతరుల ఆఫీసులకు, పోస్ట్ఫాసులకు, బ్యాంకులకు వెళ్ళేటప్పుడు పెన్ను తీసుకెళ్ళడం మర్చిపోకూడదు. నిత్యం పెన్, రఫ్‌పాడ్ దగ్గర ఉంచుకోవడం అవసరం.
ఏదైనా సమాచారం రాసుకున్నపుడు తప్పుగా రాసుకున్న పేర్లను చింపి కార్పెట్‌పై పడేయకూడదు. దగ్గరలో ఉన్న డస్ట్‌బిన్‌లో వేస్తే మీ మీద సదభిప్రాయం ఏర్పడుతుంది.
పనిమీద వేరేవారిని కలవడానికి వెళ్ళినపుడు పాన్‌లు తినడం, సిగరెట్ కాల్చడం చేయకూడదు. కాఫీ, టీలాంటివి తాగినపుడు కప్పులను డస్ట్‌బిన్‌లో వేయండి. ఎక్కడ తాగితే అక్కడే వదలకూడదు.
( ఆంధ్రభూమి నుండి)

No comments:

Post a Comment