Thursday, August 16, 2012

దేశం గర్వించదగ్గ తాత్వికుడు.. అరవిందుడు



భారతదేశం గర్వించదగ్గ మహాకవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రసిద్ధ విప్లవకారుడు, రాజనీతికర్త, తాత్వికుడు అరవిందుడు. అరవిందఘోష్ అనే ఈయన క్రీస్తుశకం 1872 ఆగస్టు 15న కృష్ణ్ధనఘోష్, స్వర్ణలతాదేవీల మూడవ కుమారునిగా జన్మించారు. ఇంగ్లండులో విద్యాభ్యాసంలో అశేష ప్రతిభతో కింగ్స్ కాలేజినుంచి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయి, తండ్రి కోరికమేరకు ఐ.సి.యస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇండియాలోని ఆయన తండ్రికి ఆనందానికి అవధుల్లేవు. సివిల్ సర్వీసులో ఉత్తీర్ణత సాధించడం ఆరోజుల్లో ఒక గొప్ప విషయం. అక్కడ అరవిందుని మనసులో దేశభక్తి భావాలు బీజాలు నాటాయి. అంతే మనసంతా స్వేచ్ఛా విముక్తిపూరిత వాతావరణం అలుముకుంది. సివిల్ సర్వీసు పరీక్షలో ఆఖరి అంశం గుర్రపుస్వారీ. ఉద్దేశ పూర్వకంగా దాన్నుంచి తప్పించుకొని స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఆయన తీసుకున్న నిర్ణయ ఫలితమే భారతదేశానికి ఒక స్వాతంత్య్ర సమరయోధుడు, ఒక మహాజ్ఞాని ఆవిర్భవానికి కారణమయింది. 29 సంవత్సరాల వయసులో (1901)లో అరవిందునికి మృణాళినితో వివాహం జరిగింది. కొంతకాలం కలిసున్నాక బరోడాలో ఉద్యోగానికి అరవిందుడు వెళ్ళాడు. ఆ కాలంలో తన భార్యకు రాసిన లేఖలలో దేశభక్తి, ఆధ్యాత్మికత తొణికిసలాడేవి.
తన భార్యకు రాసిన లేఖలో ‘ఈపాటికి ఎలాంటి విచిత్రమైన వ్యక్తితో జీవితం పంచుకున్నావో నీకు అర్ధమై ఉంటుంది. మూడు రకాల పిచ్చినన్ను వెంటాడుతుంది. 1. ఈ విద్య, విజ్ఞానం, ఆస్తులు అన్నీ భగవంతుడిచ్చినవే. కనుక అన్నీ ఆయనకే చెందుతాయి. మన కుటుంబం గడవటానికి అవసరమైనంతే వుంచుకుని మిగతాదంతా ఆయనకిచ్చేయాలి. 2. నేను ఆ సర్వాంతర్యామిని ముఖాముఖీ చూసి తీరాలి. ఒకవేళ హిందూ సిద్ధాంతం ప్రకారం అందరిలో ఉన్నట్లే ఆయన నాలో కూడా వుండివుంటే ఆ అంతర్ దర్శనాన్ని నేను సాధించి తీరాల్సిందే. 3. నా మాతృదేశం నా కుటుంబానికి సంబంధం లేని ఒక రాక్షసుడు వచ్చి నా తల్లి గుండెలమీద కూర్చుని ఆమె రక్తం త్రాగుతున్నాడు. అది భరిస్తూ నేను నా భార్యతో సుఖంగా గడపగలనా? ఆమె విముక్తికన్నా ఏదీ నాకు ముఖ్యం’ కాదు.
1906దాకా బరోడా కళాశాలలో ఫ్రెంచి, ఆంగ్ల భాషల బోధనా సమయంలోనే ఆయన, బెంగాలీ, సంస్కృతం నేర్చుకుని విపరీతంగా పుస్తకాలు చదివేరు. 1906లో బరోడానుంచి కలకత్తాకు తిరిగి వచ్చాక ‘బందేమాతరం’ పత్రికా సంపాదకునిగా అరవిందుని రచనలు యావద్భారతదేశం దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి. 1907లో సూరత్‌లో కాంగ్రెస్ మహాసభలు, మితవాదులు, అతివాదులుగా నాయకుల చీలిక, అక్కడ లాల్,బాల్,పాల్ వారసుడిగా అరవిందులకు గుర్తింపు లభించింది. ఒక బ్రిటీషు జడ్జిని చంపడానికి కుట్ర పన్నారన్న అభియోగంపై ‘బందేమాతరం’ సంపాదకుడు అరవిందుడ్ని, ఆయన సోదరుణ్ని అరెస్టుచేసి, అలీపూర్ జైల్లో పెట్టారు. ఒక ఏడాదిపాటు కొనసాగిన విచారణ అనంతరం అరవిందుడ్ని కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ, ఆయన సోదరుడికి మాత్రం అండమాన్ దీవుల్లో యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. ఈ విచారణ తాలూకు వాదోపవాదాల చివరి దశలో అరవిందుడి కోసం వాదించిన న్యాయవాది చిత్తరంజన్‌దాస్ న్యాయమూర్తి ఎదుట అన్న మాటలు చారిత్రాత్మకమైనవి.
‘‘ఈ కేసులూ, వివాదాలు, స్వాతంత్య్ర పోరాటాలు సమసిపోయాక, ఈయన అజ్ఞాతంలో వున్నా- మరణించినా, ఈ జాతి ఈయన్ని దేశభక్తిని జ్వలింపచేసిన మహాకవిగా, చైతన్యం నిండిన జాతీయతాభావాల ప్రవక్తగా, అపూర్వ మానవతావాదిగా గుర్తిస్తుంది. గౌరవిస్తుంది. ఈయన మరణానంతరం ఈయన బోధనలు ఖండ ఖండాంతరాల్లో ప్రతిధ్వనిస్తాయి.’’ ఆలీపూర్ జైల్లో గడిపిన 13-14 మాసాల కాలం అరవిందుడిలోని ఆధ్యాత్మిక చింతనని ఉద్దీపింపజేసింది. అరవిందుడు జైలునుంచి విడుదలైన తర్వాత 1909 మే 30న ఉత్తర పారాలో సభలో ఆయన చేసిన ప్రసంగం ప్రముఖమైనదే. అందులో నిజమైన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఆయన మాటల్లో ‘‘మనకు సనాతన ధర్మమే జాతీయత. ఈ జాతి సనాతన ధర్మంతో ముడిపడి వుంది. ఆ ధర్మం క్షీణించిన రోజు మన జాతీయత పతనమవుతుంది. సనాతన ధర్మం వెలుగొందినంత కాలం మన జాతీయత జ్వలిస్తూనే వుంటుంది.’’ ఆలీపూర్ జైలులో అరవిందుడిలో కలిగిన ఆధ్యాత్మిక వికాసం- స్వామి వివేకానంద, సిస్టర్ నివేదితల ప్రోత్సాహంతో ఆయన పాండిచ్చేరి వెళ్ళడానికి (1910), అక్కడ ఆశ్రమవాసంలో ఆధ్యాత్మిక బోధన సాగించడానికి కారణమైంది. ఆయన జన్మదినమైన ఆగస్టు 15న స్వాతంత్య్రం రావడాన్ని విని స్వామి ఇలా స్పందించారు. ‘‘్భరత మాతకి విదేశీ శృంఖలాలు తొలగాయి. ఇప్పుడు ఆమెను రాజకీయంగా,సాంస్కృతికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా మానవతా విలువలపరంగా ప్రపంచంలోకెల్లా మహోన్నత దేశంగా నిలబెట్టేలా మన ఆలోచనలని, జీవన సరళిని మనమే రూపొందించుకోవాల్సి ఉంది.’’ ఈ దేశంలో రెండు మహత్తరమైన జననాలు ఆగస్టు 15న సంభవించాయి. ఒకటి దేశానికి స్వాతంత్య్రం కాగా, రెండోది అరవిందుని అరుణోదయం. పాండిచ్చేరిలోని అరవిందాశ్రమం నేడు యావత్ ప్రపంచాన్నీ ఆకర్షిస్తున్న అపూర్వ ఆధ్యాత్మిక కేంద్రమై అలరారుతున్నది.

Source : http://andhrabhoomi.net/content/desam-6

Thursday, August 9, 2012

‘ఐస్ టీ’తో కిడ్నీలో రాళ్లు!



‘ఐస్ టీ’ని అతిగా సేవిస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడడం ఖాయమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. లయోలా విశ్వవిద్యాలయం వైద్య కేంద్రం యూరాలజిస్టులు తాజాగా జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణమైన ‘ఆక్సలేట్’ ఐస్ టీలో ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు తేల్చారు. ఐస్ టీ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడి మూత్ర సంబంధ వ్యాధులతో పలువురు బాధపడుతున్నట్లు గుర్తించారు. కాగా, ఆరోగ్యకరమైన ద్రవపదార్ధాలను తీసుకోనందునే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయని లయోలా వర్సిటీ వైద్య కేంద్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ మిల్నర్ హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో చెమట ద్వారా శరీరంలోని అధిక శాతం నీరు బయటకు పోతుందని, ఈ సమయంలో ఉపశమనం పొందేందుకు చాలామంది ఐస్ టీ సేవిస్తున్నారని ఆయన తెలిపారు. అందుకే వేసవిలో పరిశుభ్రమైన నీటితోపాటు ఇతర ద్రవాలను విరివిగా తీసుకోవాలి. కేలరీలు తక్కువగా ఉంటూ, మంచి రుచి కలిగిన ఐస్ టీని తాగేందుకే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. వేడి టీలో కూడా హానికరమైన ఆక్సలేట్ ఉన్నప్పటికీ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి తక్కువ ప్రభావం చూపుతుంది. మహిళలకంటే పురుషుల్లోనే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం ఎక్కువని, 40 ఏళ్లు పైబడ్డ వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు తేల్చారు. ఈ సమస్యను అధిగమించాలంటే తరచూ పరిశుభ్రమైన నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. సిట్రస్ అధికంగా ఉండే నిమ్మకాయలను వాడడంవల్ల కిడ్నీలో రాళ్ల ఎదుగుదలను నివారించవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఆక్సలేట్లు అధికంగా ఉన్న పాలకూర, చాక్లెట్లు, గింజలు వంటివి వినియోగించరాదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఉప్పు, కాల్షియం కలిగిన ఆహార పదార్ధాలను, మాంసం ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యకు దూరం కావచ్చు. ముఖ్యంగా మంచినీటిని ఎక్కువగా తాగాలని నిపుణులు పదే పదే సలహా ఇస్తున్నారు.

Source : Andhrabhoomi

Monday, August 6, 2012

జగన్- కాంగ్రెస్ దోస్తీ కటీఫ్ ?


jagan001
వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌డ్డిని దారికి తెచ్చుకోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు ప్రస్తుతానికి బ్రేకులు పడినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్‌లో తిరిగి చేరడం లేదా చేతులు కలపడం అనే రెండు ప్రతిపాదనలనూ జగన్ తిరస్కరించినట్టు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. జగన్‌ను దారికి తెచ్చుకునేందుకు తమ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్టు కాంగ్రెస్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. వ్యూహాత్మకంగా పరస్పరం సహకరించుకోవాలన్న జగన్ ప్రతిపాదనకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధంగా లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. విభేదాలు ఇంతదూరం వచ్చిన తర్వాత ఇప్పుడు కలిసినా అటు కాంగ్రెస్‌కు, ఇటు తమకూ ఎటువంటి ప్రయోజనం ఉండదని జగన్ భావిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఇద్దరం దెబ్బతింటామంటున్న జగన్!
ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము కాంగ్రెస్‌కు దగ్గరయితే వచ్చే ఎన్నికల్లో ఇద్దరమూ కలసి దెబ్బతింటామని జగన్ వాదిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పైగా కాంగ్రెస్‌కు తాము చేరువయిన మరుక్షణం సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం బలమైన ప్రత్యామ్నాయం అయికూర్చుంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను పూర్తిగా తెలుగుదేశంకు అప్పగించినట్టవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అభివూపాయపడుతున్నారు. ‘2014 ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల దాకా ఇరుపక్షాల మధ్య ఎటువంటి సంబంధమూ లేకపోవడమే మంచిది. ఆ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు మేము గెలుస్తామన్న నమ్మకం మాకుంది. మేము ఎన్‌డిఎను సమర్థించబోవడం లేదని ముందే చెప్పాం. మా విజయం కచ్చితంగా యూపీఏకే ఉపయోగపడుతుంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్‌ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ దీనినే వ్యూహాత్మక అవగాహనగా పేర్కొంటోంది. ఈ వ్యూహాత్మక అవగాహన పేరుతోనే తనపై జరుగుతున్న విచారణను సడలింపజేసుకోవాలని జగన్ భావిస్తున్నారు.

జగన్‌ను నమ్మలేమంటున్న కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ నాయకత్వం జగన్‌ను నమ్మడానికి సిద్ధంగా లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. జగన్ తనను తాను మరో శరద్ పవార్‌లాగా లేక మమతా బెనర్జీలాగా మల్చుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ‘శరద్ పవార్, మమతా బెనర్జీ ఎంత నమ్మకమైన సహచరులో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. వారిని యూపీఏలో కొనసాగించుకోవడానికి మా పార్టీ ఎన్నో అవమానాలు దిగమింగాల్సి వస్తోంది. వారు ఏది అడిగితే అది చేయవలసి వస్తోంది. జగన్ వారికంటే కొరకరాని కొయ్య. 2014 తర్వాత వీరంతా మూడవ ఫ్రంటు లేవదీయరన్న గ్యారంటీ ఏముంది? అందువల్ల ఆయనను నమ్ముకుని కాంగ్రెస్ చేతులు కట్టుకుని కూర్చోలేదు’ అని అధిష్ఠానంతో సన్నిహితంగా ఉండే ఆ నాయకుడు చెప్పారు. కేసులు విచారణలకు సంబంధించి జగన్‌పై చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు.

జగన్ కలిసొస్తే తెలంగాణ వాయిదా!
జగన్ కలిసొస్తే తెలంగాణ సమస్యను వాయిదా వేయాలని పార్టీ అధిష్ఠానం ఇటీవల సమాలోచనలు జరిపిందని కూడా ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ దూతలు కూడా తెలంగాణ సమస్యను ఇప్పుడప్పుడే తేల్చవలసిన అవసరం లేదని, తెలంగాణ సమస్యను పరిష్కరించకుండానే 2014 ఎన్నికల్లో తాము యూపీఏకు రాష్ట్రం నుంచి అవసరమైన మద్దతును కూడగడతామని ప్రతిపాదించినట్టు కాంగ్రెస్ నాయకుడు వివరించారు. ‘జగన్ కలసిరావడం లేదు. సీమాంవూధలో ఎటువంటి గ్యారంటీ లేదు. రాష్ట్రాన్ని పూర్తిగా వదిలేసుకోలేం. కనీసం తెలంగాణనయినా కాపాడుకోవాలి. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి సిద్ధమని టీఆస్ అధినేత కేసీఆర్ కూడా వివిధ సందర్భాల్లో బాహాటంగానే చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఇక ఏదో ఒకటి తేల్చకతప్పని పరిస్థితికి చేరుకుంది’ అని ఆయన వివరించారు.
( Courtesy from namastetelangana )

Saturday, August 4, 2012

దివిసీమ గాంధీ’ మండలి వెంకటకృష్ణారావు

‘‘ఇప్పటి యువకులు, విద్యార్థులు ఆయన వద్ద నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ప్రజా సేవకుడిగా ఆయన విజయం వేషాడంబరం పైనగానీ, అధికార ఐశ్వర్యాల ప్రదర్శన మీదగానీ ఆధారపడలేదు. మంత్రి పదవులు అధిష్టించినా ఆయనకు భోగవిలాసాలు అంట లేదు’’ అన్న ఆచార్య ఎన్‌జీ రంగా వ్యాఖ్యలు మండలి వెంకటకృష్ణారావు వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. గాంధేయ విలువలకు నిలువెత్తు రూపం ఆయన. తనకున్న కొద్దిపాటి ఆస్తులు కరిగిపోయినా బడుగువర్గాల బాగు కోసం నిరంతరం శ్రమించిన స్వాప్నికుడు. పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ఎప్పుడూ ప్రజల మనిషిగానే జీవించారు.

దివిసీమలోని నిరుపేదల దీనావస్థ ఎప్పుడూ మండలి కళ్లల్లో మెదలుతూనే ఉం డేది. ఆయన కృషి వల్లే బంజరు భూములను పేదలకు పంచే కార్యక్రమం 1955లో ప్రారంభమైంది. 15 వేల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచారాయన. అయినప్పటికీ 1962 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆయన అనుచరులు కంటతడి పెట్టుకోగా, వారిని ఓదారుస్తూ ‘పదవులవల్ల ఏవో సొంత ప్రయోజనాలు సాధించదలచిన వాళ్లు ఓడిపోతే బాధపడాలి గాని మనకు బాధ ఎం దుకు?’ అన్న మాటలు ఆయన సేవానిరతికి తార్కాణం.

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రాంతీయ ఉద్యమాల్ని ఎదుర్కొని, తెలుగుజాతి విచ్ఛిన్నం కాకుండా కాపాడటానికి శక్తిమేర పోరాడిన ధీరోధాత్తుడాయన. ప్రాంతీయ ఉద్యమా ల వేడితగ్గిన అనంతరం, 1974లో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తనకెంతో ఇష్టమైన విద్య-సాంస్కృతిక వ్యవహారాల మం త్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలుగునాట 1969-72 మధ్య జరిగిన రెండు వేర్పాటు ఉద్యమాలతో మసకబారిన తెలుగుజాతి ప్రతి ష్టను పునరుజ్జీవింపజేసి, ఐక్యతను పెంపొం దించవలసిన ఆవశ్యకతను గుర్తించారు.

ఆ నేపథ్యంలోనే, 1975 రాక్షస నామ సంవత్సరం ఉగాదినాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా నిర్వహించడానికి నడుం బిగించా రు. ఆ మహాసభల ద్వారా ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావడంలో మండలి కృషి అనన్యం. ఆ సభలో మాట్లాడిన వక్తలు ప్రాం తాలకు అతీతంగా తెలుగు జాతి సమైక్యతను చాటిచెప్పడం విశేషం. ‘ఖండాతరాలకు వలసపోయిన తన సంతానాన్ని రెండేళ్లకు ఒకమారైనా చూసి సంతోషించే భాగ్యం తెలుగుతల్లికి దక్కింది’ అంటూ, ఆ సభలు దిగ్విజయంకావడానికి కారకులైన నాటి ముఖ్యమంత్రి జల గం వెంగళరావు, మంత్రి వెంకటకృష్ణారావులను తెలుగునేల వేనోళ్ల ప్రశంసించింది.

ఆ మహాసభలు అందించిన ఉత్తేజం, పీవీ నరసింహారావు వంటి వారి ప్రోత్సాహం తో తెలుగు భాషాభివృద్ధికి ఒక ప్రత్యేక సం స్థను ప్రారంభించాలన్న ఆలోచనకు బలం చేకూరింది. జె.పి.ఎల్.గ్విన్, వావిలాల గోపాలకృష్ణయ్య చొరవతో ‘అంతర్జాతీయ తెలుగు కేంద్రం’ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ 1975లో ఈ సంస్థను ప్రారంభించారు. మండలి వెంకటకృష్ణారావు ఈ సంస్థకు ప్రథ మ అధ్యక్షులు. కాలక్రమంలో నాటి ముఖ్య మంత్రి నందమూరి తారకరామారావు ఈ సంస్థను తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. తదనంతర కాలంలో, ప్రథమ ప్రపం చ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథ మ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి వెంకట కృష్ణారావు అవిరళ కృషిని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు.

1977వ సంవత్సరంలో సంభవించిన ఉప్పెన, దివిసీమను అతలాకుతలం చేసింది. చక్కెర వ్యాధితో, పెరిగిన గడ్డంతో కాళ్లకు బొబ్బలెక్కుతున్నా లెక్కచేయక శ్రమించి, ఆ ఉపద్రవం నుంచి దివిసీమ కోలుకునేలా మం డలి కృషిచేశారు.

దివిసీమలో ఏ ప్రాంతాన్ని సందర్శిం చినా ఆయన పోరాటతత్వం గుర్తుకు వస్తుం ది. కృష్ణానది మీద వెడల్పు చేసిన అక్విడెక్ట్ ద్వారా నేటికీ గలగలా పారుతున్న నీళ్లలో ఆయన రూపు ప్రతిబింబిస్తుంది. ఉప్పు నీరు వరద గ్రామాలను ముంచెత్తకుండా చేపట్టిన కరకట్టల నిర్మాణాలు ఆయనలోని శ్రామికుణ్ణి జ్ఞప్తికి తెస్తాయి. దివిసీమ ప్రజల చిరకాల స్వప్నం పులిగడ్డ-పెనుమూడి వంతెనను చూసిన వారెవరికైనా మండలి గుర్తురాక మా నరు. వైఎస్ ఆ వంతెనకు కూడా మండలి వెంకటకృష్ణారావు పేరు పెట్టారు.

1926 ఆగస్టు 4న కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా, పల్లెవాడ గ్రామంలో పుట్టిన మం డలి ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలనందుకున్నారు. 1997 సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు. ‘బాధలో ఉన్న వారిని మనమే ముందు వెళ్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ గుండెల్లో భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి.

-కోట వేణుగోపాల కృష్ణప్రసాద్
(నేడు మండలి వెంకటకృష్ణారావు 86వ జయంతి)
Source: Sakshi

Thursday, August 2, 2012

త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య





జాతీయ పతాకం రెపరెపలాడే వరకు ఒక్క తెలుగు వారే కాకుండా.. జాతియావత్తూ స్మరించుకోదగిన మహాపురుషుల్లో పింగళి వెంకయ్య ఒకరు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు (ప్రస్తుతం మొవ్వ మండలములో ఉంది) గ్రామంలో హనుమంతరాయుడు-వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి. ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లిలో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది.

ఈయన ఉన్నత పాఠశాల పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేసేందుకు కొలంబో వెళ్లాడు. 19 ఏళ్ల ప్రాయంలోనే దక్షిణాఫ్రికాలో జరుగిన బోయర్ యుద్ధములో పాల్గొన్న దేశభక్తుడు. దక్షిణాఫ్రికాలోనే మహాత్మా గాంధీని కలిసిన తెలుగు యువనేత. వీరిమధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు సాగింది. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన గురించి చర్చలు జరిపారు. 1916లో "భారతదేశానికొక జాతీయ జెండా" అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు. 
అనంతరం బందరు జాతీయ కళాశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన పింగళి నాడు చిత్రించిన పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది. 1916 సంవత్సరం




లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే తొలిసారి ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి.

గాంధీజీ, వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం- ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నం గల ఒక జెండాను తయారు చేయమని కోరారు. మహత్ముని సూచనపై కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్యలో రాట్నం చిహ్నం గల జాతీయ జెండాను రూపొందించారు. అనంతరం సత్యం-అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగును కాషాయం-ఆకుపచ్చ రంగుల మధ్య ఉండేలా రూపొందించాలని గాంధీజీ అభిప్రాయపడగా.. వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి ప్రస్తుతం శతకోటి భారతీయలు సెల్యూట్ చేస్తున్న నేటి మువ్వన్నెల జెండాను దేశానికి అందించారు. మన జాతీయ పతాకం మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి రూపొందించడం.. ఆంధ్రులందరికీ గర్వకారణమైన విషయం.  



త్రివర్ణ పతాక ప్రత్యేకత ఇదే...
కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లీంలకని పేర్కొన్నారు. అయితే.. భిన్నత్వంలో ఏకత్వమైన సువిశాల భారతావనిలో ఇతర మతాలకు సమాన ప్రాధాన్యత కల్పించాలన్న జాతిపిత అభిప్రాయంతో ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారు. మధ్యనున్న రాట్నం చిహ్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేస్తుంది. అంటే కార్మిక కర్షకులపై ఆధారపడిన మన దేశం, సత్యం-అహింసలపై ఆధారపడటంతో సుభిక్షంగా ఉంటుందని గాంధీజీ ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.

అయితే.. 1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ.. త్రివర్ణ పతాకంలో రాట్నం గుర్తుకు బదులుగా అశోకుని ధర్మచక్రం ఉండాలని సూచించారు. దీంతో రాట్నంకు బదులు ధర్మచక్రం ఏర్పాటు చేశారు. ఆ ఒక్క చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి మన జాతీయ జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతంగా పేర్కొంటారు. ( నేడు పింగళి వెంకయ్య వర్ధంతి )