Friday, January 20, 2012

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా అన్నా, రాందేవ్ ప్రచారం

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురీదుతున్న బిజెపికి పౌరసమాజం నాయకుడు అన్నా హజారే, యోగా గురువు బాబా రాందేవ్ మద్దతు లభించింది. పటిష్టమైన లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసిన ఉత్తరాఖండ్‌లోని బిజెపి ప్రభుత్వానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నట్టు అన్నా హజారే ప్రకటించారు. ఆయనతోపాటు తానూ బిజెపికి అనుకూలంగా ప్రచారం చేస్తానని బాబా రాందేవ్ ప్రకటించారు. అవినీతి ఆరోపణలతో రమేష్ పోక్రియాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడంతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవటం బిజెపికి తలకు మించిన పనిగా మారింది. నిజాయితీ పరుడిగా పేరున్న బిసి ఖండూరిని మళ్లీ ముఖ్యమంత్రిగా నియమించినా బిజెపికి ప్రజల నుండి ఆశించిన మద్దతు లభించటం లేదు. అవినీతికితోడు పార్టీలో చోటుచేసుకున్న అసమ్మతి బిజెపి విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న బ్రాహ్మణులు, సైనిక, మాజీ సైనిక కుటుంబాలకు చెందిన వారు బిజెపి పేరు చెబితేనే మండిపడుతున్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో పార్టీ ఓడిపోవటానికి అప్పటి ముఖ్యమంత్రి ఖండూరి బాధ్యుడంటూ ఆయనను అవమానకర రీతిలో పదవినుంచి తప్పించారు. సైన్యంలో మేజర్‌గా పనిచేసిన ఖండూరి ముఖ్యమంత్రిగా పదవీ కాలం పూర్తి చేయకముందే తొలగించి ఆయన స్థానంలో రమేష్ పోక్రియాల్‌ను నియమించటాన్ని బ్రాహ్మణులు, సైనిక, మాజీ సైనిక కుటుంబాలు ఎంతమాత్రం హర్షించలేదు. బిజెపి అధినాయకత్వం ఇప్పుడు ఖండూరిని అసెంబ్లీ ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రిగా నియమించినా ఫలితం లేకపోయింది.
కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉత్తరాఖండ్‌లో రెండు రోజులు పర్యటించి బిజెపి ప్రభుత్వం అవినీతిని ఎండగట్టారు. అవినీతితో కూడుకున్న బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ ఇచ్చిన పిలుపు ప్రజల్లోకి బాగానే వెళ్ళింది. సోనియా ఆరోపణలను రాష్ట్ర బిజెపి సమర్థవంతంగా ఖండించలేకపోయింది. అందుకే బిజెపి అధినాయకత్వం తాజాగా పౌరసమాజం నాయకుడు అన్నా హజారే, యోగా గురువు బాబా రాందేవ్‌ను ఎన్నికల ప్రచార బరిలోకి దించుతోందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోక్రియాల్ అవినీతి నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఖండూరి రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే లోకాయుక్తను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించారు. హజారే తయారు చేసిన లోకపాల్ బిల్లును యథాతథంగా తీసుకుని రాష్ట్ర లోకాయుక్త చట్టాన్ని తయారు చేసి శాసనసభలో ఆమోదించారు. తమ బిల్లును చట్టం చేసిన ఖండూరి పట్ల అన్నా హజారేకు ఎంతో సానుభూతి ఏర్పడింది. జన లోకపాల్ బిల్లును ఆమోదించాలన్న తన డిమాండ్‌ను బుట్టదాఖల చేసిన కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్న హజారే ఉత్తరాఖండ్‌లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. బాబా రాందేవ్ కూడా కాంగ్రెస్ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. రాంలీలా మైదానంలో రాందేవ్ చేపట్టిన నిరాహార దీక్షను కాంగ్రెస్ ప్రభుత్వం భగ్నం చేసిన సంగతి తెలిసిందే. దీంతో బాబా రాందేవ్ ఇప్పుడు అన్నా హజారేతో చేతులు కలిపి ఉత్తరాఖండ్‌లో బిజెపికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.
( From Andhrabhoomi Daily )

No comments:

Post a Comment