Friday, November 30, 2012

టివి, సినీ కళాకారుల ఇళ్లలో ఐటి సోదాలు.. ఎంత దాచారేంటి..?


 Income Tax Rides on Brahmanandam House, Income Tax Rides on TV anchors, Income Tax Ride Brahmanandam



ఆదాయపు పన్ను శాఖ అధికారులు హైదరాబాద్ లో సినీ, టివి ఆర్టిస్టుల ఇళ్ళ ఫై కొరడా జులిపించారు. నిన్న  మధ్యాహ్నం 12 గంటల నుండి అర్థ రాత్రి వరకూ మొత్తం 12 బృందాలు వారి ఇళ్ళ ఫై ఈ దాడులు నిర్వహించాయి. హాస్య నటుడు బ్రహ్మానందం, గాయని సునీత, గీతా మాధురి, టి వి ఆర్టిస్టులు ఓంకార్, ఉదయ భాను, ఝాన్సీ,సుమ ల ఇళ్ళ ఫై ఏక కాలంలో 40 మంది అధికారులు దాడులు నిర్వహించారు.
 వీరి ఆదాయానికి తగినట్లుగా పన్ను కట్టలేదనే కారణంగా వీరి ఇళ్ళ ఫై దాడులు నిర్వహించినట్లుగా సమాచారం.  ఈ సినీ ప్రముఖుల ఆదాయానికి సంభందించిన వివరాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలు అధికారులు సేకరించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, శ్రీ నగర కాలనీ, మోతీ నగర్ ప్రాంతాల్లో హైదరాబాద్ ఫిలిం సర్కిల్ కమీషనర్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.
 తన ఇంట్లో దాడులు నిర్వహిస్తున్న సమయంలో బ్రహ్మానందం షూటింగ్ లో ఉన్నట్లు తెలిసింది. అలాగే ఝాన్సీ, సుమ లు కూడా వారి ఇళ్లలో దాడులు నిర్వహించే సమయంలో వారి ఇళ్లలో లేరు. ఈ దాడులకు సంభందించిన పూర్తి వివరాలు అందించేందుకు అధికారులు నిరాకరించారు. ఐతే, త్వరలో అన్ని వివరాలు అందిస్తామని మాత్రం వారు ప్రకటించారు.

Tuesday, November 27, 2012

'పొగ'బెడుతున్న స్మోకింగ్!

గడచిన వందేళ్లలో(1910-2010) ఒక్క మనదేశంలోనే పదికోట్ల మంది ‘పొగ’కు ప్రాణాలు కోల్పోయారని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది.


‘వినుడి వినుడీ సిగరెట్ గాథ...’ అంటూ పాడుకునే పాటలింక చాలించాలంటున్నారు అధ్యయనకర్తలు. ధూమపానంతో ఆయువు అర్థాంతరంగా ఆగిపోతుందని శతవార్షిక గణాంక సహితంగా హెచ్చరిస్తున్నారు. ‘మా చిన్నప్పటి నుంచి ఇలాంటివి ఎన్ని వినలేద’ని తేలిగ్గా తీసుకోకండి. గత నూరేళ్లలో ధూమపానం ఎంతమందిని బలితీసుకుందో తెలిస్తే ఈ మాట అనడానికి ఎవరూ సాహసించరు. పెపైచ్చు పొగ పేరు చెబితే పర్లాంగు దూరం పరుగెత్తుతారు. ధూమపానాన్ని విడిచిపెట్టినా పెట్టొచ్చు!

‘పొగ’లో ఉన్న గమ్మత్తు ఆస్వాదించేవాడికే అవగతమవుతుందంటారు ధూమపాన ప్రియులు. స్మోకింగ్ లేనిదే శ్వాస అందదని చెప్పే మహా ‘పొగ’భిమానులు ఉన్నారంటే అవాక్కవాల్సిన పనిలేదు. రింగులు రింగులుగా పొగ వదలడంతో మొదలయ్యే ధూమపానం వ్యసనంగా మారుతోందన్నది నిష్ఠూర నిజం. ఒకసారి ఈ వ్యసనానికి అల వాటు పడిన ప్రాణం నిత్యం పొగతో పాటు ప్రయాణం చేస్తుంటుంది. ఒక్క క్షణం ‘పొగ’ అందకపోయినా ప్రాణం విలవిల్లాడుతుంది. స్మోకింగ్ జోలికి పోవద్దని ఇలాంటి వారికి ఉచిత సలహా ఇచ్చామనుకోండి-పొగ తాగనివాడు దున్నపోతుగా పుడతాడంటూ శాపిస్తారు.

పొగరాయుళ్లు తమతో పాటు పక్కనున్న వాళ్ల ప్రాణాలకు పొగ పెడుతున్నారు. వారు వదులుతున్న పొగ సాటివాళ్ల ఉసురుకు ఎసరు పెడుతోంది. సిగరెట్, బీడీ వంటి పొగాకు ఉత్పత్తుల వస్తున్న పొగ శరీరంలోని ప్రధానవయవాలను నెమ్మదిగా కబళిస్తుంది. శ్వాస సంబంధమైన రోగాలకు హేతువవుతుంది. విషాదం ఏమిటంటే ఆరోగ్యానికి హానికరమని తెలిసినా పొగ పీలుస్తున్నవారెందరో ఉన్నారు. మృత్యువుకు చేరువవుతున్నారు. మనిషి మెదడుపై స్మోకింగ్ ప్రతికూల ప్రభావం చూపుతుందని లండన్ కింగ్స్ కాలేజీ పరిశోధకులు కనుగొన్నారు. ఆరోగ్యం, జీవన విధానం ఆధారంగా వారీ అంచనాకు వచ్చారు.

గడచిన వందేళ్లలో(1910-2010) ఒక్క మనదేశంలోనే పదికోట్ల మంది ‘పొగ’కు ప్రాణాలు కోల్పోయారని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. వీరిలో ఏడు కోట్ల మంది బీడీలు తాగేవారని తేలింది. స్మోకింగ్ ప్రారంభించిన 30 నుంచి 40 ఏళ్లలోనే పొగరాయుళ్లు చావుకు చేరువవుతున్నారని స్పష్టమయింది. బీడీ, సిగరెట్ తయారీ పరిశ్రమలు సహా 23 ప్రధాన మాధ్యమాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయం సాగింది. ‘పొగ’ ప్రమాదస్థాయిని దాటి వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశంలో పొగాకు నియంత్రణ చర్యలపై సత్వరమే సమీక్ష జరపాలని, పొగాకు పరిశ్రమను ప్రోత్సహిస్తున్న విధానాలను ప్రభుత్వం మరోసారి పరీక్షించాలని అధ్యయకర్తలు సూచిస్తున్నారు. ధూమపానానికి ఇకనైనా మంగళం పాడకపోతే పెనుముప్పు తప్పదు.
Source: sakshi

Saturday, November 24, 2012

హ్యాకింగ్ కు గురైన గూగుల్, మైక్రోసాఫ్ట్ వెబ్ సైట్లు

పాకిస్తాన్  కు చెందిన గూగుల్, మైక్రోసాఫ్ట్ వెబ్ సైట్లు ( google.com.pk, microsoft.pk ) టర్కీ హకెర్స్ ద్వారా హక్ చేయబడ్డాయి . హాకర్లు ఉచిత హోస్టింగ్ సంస్థ ఐన freehostia.com ద్వారా హక్ చేసినట్లు మొదటిగా గుర్తించారు.
హాక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ లో " “Pakistan Downed” అని వెబ్సైటు లో ఉంచారు .



ఇంకా ఆ వెబ్ సైటులు  పునప్రారంభించబడలేదు. వివరాలు ఇంకా అందవలసి ఉంది.

Wednesday, November 21, 2012

అసమాన ప్రవచన చక్రవర్తి - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు



పుస్తక పఠనం చేసేవారు చాలామంది కాన వస్తారు. అందులో విషయాలను అర్ధం చేసుకునే గ్రహణపరాయణత ఉన్న వారు మరికొందరు; అలా అర్ధం చేసుకున్న విషయాన్ని, ఇంకా విశ్లేషించి సారాన్ని ఆకళించుకునే వారు బహు కొద్ది మంది. ఆ విజ్ఞాన సారాన్ని దైనందన జీవిత విధి విధానాలతో జోడించి విషయాన్ని, సామాన్య పద ప్రయోగాలతో జనా హృదయాలకు తాకేటట్టు మాటలాడ్డం ఇంకా అరుదు. ఈ అరుదైన కోవకు చెందిన వారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన ప్రవచన శిరోమణి. నిరాడంబర జీవి, నిష్కలమైన వ్యక్తిత్వం వీరిధి.

శ్రీమద్భాగవతం, రామాయణం, పురాణాల మీద దాదాపు నూట ఇరవై ప్రవచనాలు చేశారు చాగంటి వారు. వీటిలో సుందర కాండ, సుబ్రహ్మణ్య వైభవం, స్థల పురాణం, గీతా వైభవం ఉన్నాయి. 

 చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. శివ పురాణము నండు భక్తుల కధలు, మార్కండేయ చరిత్ర, నంది కధ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. విరాట పర్వము అనే ప్రవచనంలో భారతమునందలి అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కధలు, కృ ష్ణావతారం యొక్క పూర్తి కధ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రధమముగా శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థాన కధ చోటు చేసుకున్నాయి. సౌందర్య లహరి ఉపన్యాసాలు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి వివరణ ఉంది. శిరిడి సాయి బాబా కధ చోటు చేసుకుంది. ఇంకా రుక్మిణీ కల్యాణం, కనకధారా స్తోత్రం, గోమాత విశిష్ఠత, భజగోవిందం, గురుచరిత్ర, కపిల తీర్ధం, శ్రీరాముని విశిష్ఠత, తిరుమల విశిష్ఠత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరాకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు ఛేశారు కోటేశ్వర రావు. ఆయన తన వాక్పఠిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి బ్రహ్మశ్రీ అని గౌరవ నామాన్ని పొందారు.
ఇవేకాక పూజా విశిష్టత, ధ్యాన ప్రక్రియ, మనుష్య జీవితము, సంగీత సాహిత్య సమ్మేళనం, సామాజిక కర్తవ్యం, భక్తి, వివాహ వైభవం, గోమాత విశిష్టత, సనాతన ధర్మము, పూజా విధి, ఏకాదశి వ్రత మహత్యము, ఆదిత్య హృదయం, ఆది శంకరాచార్య శివానంద లహరి కూడా ఉన్నాయి. ఇలా విభిన్న అంశాల మీద ఏకధాటిగా మాట్లాడగల దిట్ట. ఆయన చెప్పినవి విన్నవారి మనసులని హత్తుకునేవిగా, అలోచింప జేసేవిగా ఉండటం బహు విశేషం. 
వీరి ఉపన్యాసాలు, ప్రవచనలు తరచూ మా టీ వీ , భక్తి టీ వీ, ఎస్ వి బి సి చానెల్స్ లో ప్రసారమవుతున్నాయి. వీటికి అనేక అనుయాయులు ఉన్నారు.

నలబై రెండు రోజుల పాటు, గుంటూరులో సంపూర్ణ రామాయణం మీద ప్రవచనలు చేశారు. అలానే శ్రీమద్భాగవతం మీద నలబై రెండు రోజుల పాటు ఉపన్యసించారు. శివ పురాణం విషయాలపై ముప్పై రోజులు ఉపన్యసించి అనేక విషయాలను తన దృక్పథంలో చాటారు చాగంటి కోటేశ్వరరావు గారు.

భక్తి, భావం, నమ్రత కనిపిస్తాయి వీరి వ్యక్తిత్వంలో. హిందూ ధర్మ సాంప్రదాయాలు పాటిస్తూ, పాండిత్యం మూర్తీభవిస్తూ, ముఖ వర్ఛస్సు కలిగి ఉన్న వారు చాగంటి గారు. శివ తత్వం, శ్రీ కాళహస్తీశ్వర శతకం, లలితా సహస్రనామం తదితర అంశాల మీద మంచి వక్త.

కోటేశ్వరరావు గారికి డబ్బు యావ లేదు. భారతీయ సంస్కృతిక, సాంప్రదాయం, ఆధ్యాత్మికతలను పెంపొందిస్తూ, వాటి పరివ్యాప్తికి కృషి చేస్తున్నారు. ఇది వారి జీవితాశయమని చెప్పవచ్చు. చాగంటి గారు కారణ జన్ములు అని కొందరు పండితులు సెలవిచ్చారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో పనిచేస్తున్నారు (ప్రభుత్వ ఉద్యోగి). వీరి తండ్రి చాగంటి సుందర శివరావు గారు; తల్లి సుశీలమ్మ గారు. కోటేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు;

చాగంటి కోటేశ్వరరావు గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం చాగంటి విద్యా పురస్కారం (పారితోషకం, జ్ఞాపిక) వైద్య విద్యార్ధికి అందజేస్తున్నారు.

అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారే కరువైపోతున్నారు. అలాటిది స్వచ్ఛమైన భాషలో, నిబద్ధతో మాట్లాడ గల దిట్ట శ్రీ చాగంటి వారు. వీరికి భాష పై ఉన్న పట్టు అపారం. విషయంతో పాటు నిక్షిప్త, నిగూడార్ధాలు తెలిసుకున్నవారు; వీరికి వాక్ సుద్ధి ఉంది. వీరు ప్రసంగించినప్పుడు జనాలు మంత్ర ముగ్దులు అవటం కాయం; పండితులు, పామరులు అందరూ హర్షిస్తారు. విషయాన్ని అంత సూటిగా, సరళముగా జనముందుంచుతారు. ఆలోచింప చేయిస్తారు. ఇది అసామాన్యమైన విషయం.

అందుకున్న పురస్కారాలు:
శారదా జ్ఞాన పుత్ర
ప్రవచన చక్రవర్తి - కంచి కామకోటి శంకరాచార్య గారు చాగంటి గారికి " ప్రవచన చక్రవర్తి " గౌరవం ఇచ్చారు.

వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ, ప్రవృత్తి ఎంత బాగా నిర్వర్తించ వచ్చో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని చూసి నేర్చుకోవచ్చు అంటే అతిశయోక్తి కాదు.

అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారే కరువైపోతున్నారు. అలాటిది స్వచ్చమైన భాషతో పాటు, అచ్చ తెలుగులో శాస్త్రీయ, సాంప్రదాయ, సాంస్కృతిక, పురాణ, నిత్య విధి విధానాల అంశాలపై అనర్గళముగా మాట్లాడుతూ జన ప్రవర్తనా నియమావళిని, వారి ఒరవడిని ప్రభావితం చేయగలుతున్న మహా వ్యక్తి శ్రీ చాగంటి వారు. అంతే కాదు మాటలాడే అంశం భావ, అంతర్గత, నిక్షిప్తార్ధాలను రంగరించుకుని విషయాన్ని నిబద్ధతో గంటాపథంగా చెప్పే అసామాన్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఇలా చెప్పేవారున్నారు; వినే వారు కూడా బయలుదేరారు. విని మంచి చేద్దాం, మంచి ఒరవడి సాధించుకుందాం అన్న తాపత్రయం విన్న వారిలో బయలుదేరింది. ఇది గమనార్హం. ఎందుకంటే ఇది గొప్ప విషయం. విషయం అని చెప్పే కంటే మార్పు అని చెప్పడం సమంజసం. తెలుగు నాట ఇలాటి ఉదాహరణలు తారసిల్లడం ముదావహం. తెలుగు నాట వీరి అనుయాయులు రోజు రోజుకి పెరుగుతున్నారు. ఇలా జన హృదయాలని జయించుకున్నే మాహద్భాగ్యం ఎందరికి లభిస్తుంది? అది వారి అదృష్టం. హిందూ సంస్కృతిక, సాంప్రదాయ, ఆధ్యాత్మికత పెంపొందించి పరివ్యాప్తి చేస్తున్నారు చాగంటి కోటేశ్వరరావు గారు. 

తెలుగు నాట ఇలాటి ఆణి ముత్యాలు మరికొన్నిదొరుకుతాయని  ఆశిద్దాo . వీరి ప్రభావంతో మరిందరు అసలు తెలుగు ధనం సాధిస్తారని ఆశిద్ధాం. ..
 చాగంటి వారి ప్రవచనాల వీడియోలు youtube లో  , ఆడియో లు ఇతర విషయాలు వారి వెబ్సైటు ద్వారా దర్శించవచ్చు.  వీరి ప్రవచనాలు పుస్తకాలు గా డౌన్లోడ్ చేసుకోవచ్చు .
వెబ్సైటు: http://telugu.srichaganti.net/Default.aspx

 ఈ పోస్ట్ కు మూలాలు : ( కృతజ్ఞతలు ) 
http://telugu.srichaganti.net/SivaTatwam.aspx,
వికీ పెడియా,
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/nov12/telugutejomurthulu.html

Tuesday, November 20, 2012

మజ్లిస్‌ కటీఫ్‌పై ముందే సంకేతాలు?


మజ్లిస్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకోబోతున్నట్టు సర్కారుకు ముందుగానే సంకేతాలు అందాయా?
ఆ పార్టీ నేతలను శాంతిపజేసుకొని పొత్తును కొనసాగింపజేసేందుకు ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రయత్నించారా?
మజ్లిస్‌ నేతలు వివిధ సందర్భాల్లో చేసిన విజ్ఞప్తులపై సర్కారు ఆగమేఘాలపై స్పందించిన తీరును చూస్తే అవుననే సమాధానం వస్తోంది. మజ్లిస్‌ నేతలను ప్రసన్నం చేసుకోవటానికి చాలా తంటాలు పడినట్టు స్పష్టమవుతోంది. మజ్లిస్‌ వివిధ సందర్భాల్లో పేర్కొన్న 41 కోర్కెలను సంబంధిత శాఖలకు పంపి వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా కృషి చేసింది. సంబంధిత దస్త్రాలను వెంటనే ముఖ్యమంత్రికి పంపాలంటూ ఆయా శాఖలకు పలు విడతలుగా లేఖలు పంపింది. రాజధానిలోని నిషేధిత భూములకు సంబంధించి తంటాలు పడి రూపొందించిన జాబితాను సర్కారు ఉపసంహరించుకోవడం ఇందులో భాగమే. ఇన్ని చేసినా అధికార పార్టీకి మజ్లిస్‌ దూరమయ్యింది.మజ్లిస్‌ నేతల డిమాండ్లపై ప్రభుత్వం ఇటీవల కాలంలో సత్వర చర్యలు చేపడుతూ వచ్చింది. వాటనిి పరిశీలించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం వివిధ శాఖలకు సూచించటంతో పాటు తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి తెలుసుకొంటూ వచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వివిధ శాఖలకు నవంబరు 7వ తేదీన, అంతకుముందు వెళ్లిన లేఖలు 'ఈనాడు'కు లభించాయి. రాజకీయ పార్టీలు ఇచ్చే వినతులను సీఎం కార్యాలయం సంబంధింత శాఖలకు పంపటం సాధారణమే అయినప్పటికీ మజ్లిస్‌ వినతులపై మాత్రం ప్రత్యేక దృష్టి కనబర్చింది. వినతులపై తాజా పరిస్థితిని సీఎం తెలుసుకోగోరుతున్నారని, దస్త్రాలను వెంటనే పంపాలని, దస్త్రం అవసరం లేకుంటే నోట్‌లను పంపాలని ఆయా శాఖలను తొందరపెట్టింది.నవంబరు 7వ తేదీ నాటి లేఖలో ప్రధానంగా 9 అంశాలను సీఎం కార్యాలయం పొందుపర్చింది. రిజిస్ట్రేషన్లను చేయకూడని భూముల జాబితా ఉపసంహరణ, ఖదీర్‌ను పెరోల్‌పై విడిచిపెట్టటం, పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక ఫలితాల విడుదల, దార్‌ సలాం విద్యా సంస్థకు 5 ఎకరాల భూమి అందజేత, ఎంఐఎం కార్యాలయానికి భూమి ఇవ్వటం, ఏసీ గార్డ్సులోని భూమి వ్యవహారాన్ని కొలిక్కి తేవటం, మైనారిటీ సంక్షేమానికి కమిషనరేట్‌ ఏర్పాటు, అమాయక యువతపై కేసుల ఉపసంహరణ ఈ జాబితాలో ఉన్నాయి. వీటిపై తాజా పరిస్థితిని నవంబరు 9వ తేదీలోగా తెలపాలని సీఎం కార్యాలయం ఆ లేఖలో పేర్కొంది. ఈ లేఖలో పేర్కొన్న నిషేధిత భూముల జాబితా ఉపసంహరణతో సహా కొన్నింటిపై ఆయా శాఖలు సానుకూలంగా స్పందించాయి. అంతకు ముందు సెప్టెంబరు 3వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన లేఖలో మరికొన్ని ముఖ్యమైన కొర్కెలు ఉన్నాయి. నోటరీపై కొనుగోలు చేసిన భూములకు ఒక సారి రిజిస్ట్రేషన్లను అనుమతించటం ఇందులో ఒకటి. మైనారిటీలకు ఉప ప్రణాళిక అమలు, రుణ మంజూరీకి ఆదాయ పరిమితి పెంపు, ఫిరోజ్‌ గాంధీ నగర్‌ భూముల క్రమబద్ధీకరణ వంటివి వాటిలో ఉన్నాయి. ఆగస్టు 17నాటి లేఖలో మొత్తం 41 అంశాలు ఉన్నాయి. 'నిర్దిష్ట గడువు ప్రాతిపదికన అత్యవసర చర్యలు అవసరం' అంటూ ఆనాటి లేఖలో సీఎం కార్యాలయం పేర్కొంది. ఒవైసీ ఆసుపత్రి అంశం, 2006 నాటి పాతనగరం ప్యాకేజి అమలు, మూసీ ఆధునికీకరణ, మెట్రోపాలిటన్‌ ముసాయిదా ప్రణాళికను నోటిఫై చేయకుండా ఉండటం, పాత నగరంలో కొత్తగా జూనియర్‌, డిగ్రీకాలేజీల ఏర్పాటు వంటివి వీటిలో ఉన్నాయి.
From :eenadu

Sunday, November 18, 2012

కార్తీక మాసం-విశిష్టత



స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం "కార్తీకమాసం'. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తీకమాసం" అని పేరు వచ్చింది.

"న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్"


అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే "కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు." అని అర్ధం. 
భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు.
ఉత్థాన ఏకాదశి
ఈ మాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశి ఎంతో వైశిష్ట్యం వుంది.ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు.దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఉత్థాన ఏకాదశినాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉపవాసం వుండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే ఎంతో మంచిది మంచిది.ఈ కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైబోవోపేతంగా పూజలందుకుంటారు ప్రధానంగా భక్తులు కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీసమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిసే పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మిక.
కేదారేశ్వర వ్రతం
చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.
కోరికలను తీర్చే దీపపు కాంతులు
పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ సమయంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు.
పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమి శారణ్యంలో నివసిస్తున్న అదిగురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు  బోధించాడు. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మిదేవికి ఈ వ్రతవిధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం.కార్తీక పౌర్ణమిరోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇవాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది.
కార్తీక సోమవారాలు - నదీస్నానాలు
కార్తీకమాసం వచ్చిన వెంటనే నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసంలో వేకువవేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు  పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా  కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరి మితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముక్ష్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.
కార్తీక పౌర్ణమి
కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం  కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని  పూర్వీకులు చెబుతుంటారు.
Sources: http://telugudanam.co.in &http://jyothiv.blogspot.in

Saturday, November 17, 2012

"నిరీక్షణ" లఘు చిత్రం విశేషాలు కధాంశం


నిరీక్షణ ఒక తండ్రి కథ. కొడుకు పుడితే ప్లస్, కూతురు పుడితే మైనస్ అనుకునే రోజుల్లో పుట్టి పెరిగిన ఎంతో మంది తండ్రుల కథ. బిడ్డ పుట్టిన క్షణం నుండి ఆ బిడ్డ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ, ఆ బిడ్డ రేపు కు బంగారు నగిషీలు అద్దేందుకు తన జీవితం లోని ప్రతి క్షణాన్ని హారతి కర్పూరం లా చేసే తండ్రుల వ్యధ.
మాధవరావు కు తన కొడుకు  దీపక్ అంటే ప్రాణం. కూతురు దివ్య అంటే చిన్నచూపు లేకపోయినా ఆయన జీవితానికి కేంద్ర బిందువు కొడుకు దీపక్. దీపక్ పుట్టిన క్షణం నుండి ఆయన జీవితంగా మారిపోయాడు. తన కొడుక్కు ప్రతి క్షణం బెస్ట్ ఇవ్వాలని ఆయన తపన. ఆయన ఏ పండక్కు బట్టలు కొన్నదో గుర్తు లేదు కాని కొడుక్కు మాత్రం లేటెస్ట్ ఫాషన్ ప్రకారం బట్టలు కొనాల్సిందే. దీపక్ బట్టలు కొన్నాకే ఇంట్లో ఎవరికైనా బట్టలైనా పండగైనా. తన తాహతుకు ఎక్కువ అయినా ఊర్లోని మంచి స్కూల్ లోనే కొడుకు ను చదివించేందుకు తపన పడతాడు. దీపక్ ను ఇంజనీర్ చేసేందుకు జీవితమంతా డబ్బు ఆదా చేసి, అమెరికా లో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని ఇంటిని సైతం తాకట్టు పెట్టిన తండ్రి అతను. అలాంటి కొడుకు అమెరికా లో బాగా చదివి, రేపో మాపో తిరిగి వస్తాడని వెయ్యి కళ్ళలో ఎదురుచూస్తున్న ఆ తల్లి తండ్రులకు అక్కడి ముష్కరుల ధన దాహానికి తన కొడుకు బలి అయ్యాడని తెలుస్తే ఆ తండ్రి గుండె ఎలా తట్టుకుంటుంది? కంటిపాప లా చూసుకొని పెంచిన కొడుకు చేతికి అంది వచ్చాడని ఆనందపడ్డ ఆ తండ్రికి తనయుడు చేజారిపోయాడు అన్న నిజాన్ని ఎలా ఎదుర్కున్నాడు? మరణించిన కొడుకు శవం కూడా వారం తర్వాత కాని తిరిగి రాకపోతే….కన్న కొడుకు ను కడసారి చూసేందుకు కూడా నిరీక్షించాల్సిన పరిస్థితులలో ఆ తల్లి తండ్రుల గుండెకోత కు అంతమెక్కడ? చేసిన అప్పులు తీర్చేంత వరకు శవాన్ని కదలనివ్వమని అప్పులవాళ్ళు ఇంటి మీదకు వస్తే, బిడ్డ అకాల మరణం తాను కట్టుకున్న ఆశల సౌధాలు కూల్చేస్తే ఆ తండ్రి మానసిక పరిస్థితి ఏంటి? ఆ సంఘటన మాధవరావు జీవితాన్ని ఎలా మార్చేసింది? కొడుకే జీవితం అనుకున్న ఆయన కొడుకు తర్వాత జీవితాన్ని అంగీకరించగలిగాడా? రాని కొడుకు కోసం ఆయన నిరీక్షణ కు అర్థమేది?మనం టీ వీ లలో పేపర్ లలో చూసే వార్తలలో అతి సాధారణమైన వార్తలు  అమెరికా లో ఆంధ్ర విద్యార్ధి మృతి…ఆస్ట్రేలియా లో ఇండియన్ స్టూడెంట్ ను కాల్చి చంపినా ముష్కరులు….  ఇలాంటివే…..పిల్లలను ఎన్నో కలలతో…బంగారు భవిష్యత్తు ఇవ్వాలని అప్పులు చేసి, తల తాకట్టు పెట్టి విదేశాలకు పంపే తల్లితండ్రులు తమ బిడ్డలు కళ్ళముందే రాలిపోతుంటే, వారిని చివరి చూపు చూసేందుకు కూడా వారం, పది రోజులు ఎదురు చూడాల్సి వస్తుంటే వాళ్ళ బాధ గురించి ఆలోచిస్తున్నపుడు వచ్చిన ఆలోచన ఈ కథ.  బిడ్డ పుట్టిన క్షణమే డాక్టర్ చెయ్యలా, ఇంజనీర్ గా చూడాలా అని తల్లితండ్రుల ఆలోచనలు మొదలు అయ్యే రోజులలో, ఏమి అవ్వాలో నిర్ణయించుకునే ముందే బిడ్డ కలలు కూడా తామే కనే తల్లితండ్రుల జీవితాలలో బిడ్డలు లేని కలలు రోజు వెక్కిరిస్తుంటే….ఆ వ్యధ కు తెరరూపం ఇవ్వాలనే ఆలోచనే ఈ నిరీక్షణ.మా ఆలోచన మీకు నచ్చిందా? ఈ ప్రయత్నం లో మాకు చేయూత ఇవ్వాలని అనుకుంటున్నారా?మీకు మా ధన్యవాదాలు. సినిమా అంటే ప్రాణం గా భావించే కొంతమంది కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది. కాని ఈ ప్రయత్నానికి ఇంకెంతో మంది చేయూత అవసరం. ముందుకు వెళ్ళమనే ఒక ప్రోత్సాహం కావచ్చు…కథ చెప్పడం లో, సినిమా తీయడం లో మీరు  ఏ విభాగం లోనైనా  నిష్ణాతులు అయితే మీ మార్గదర్శనం   కావచ్చు… మీ చేయూత కావచ్చు…జీరో బడ్జెట్ తో చేస్తున్న ఈ షార్ట్ ఫిలిం కు ఆర్ధిక సాయం కావచ్చు..మా ప్రయత్నం మరో పదిమంది కి చెప్పి జనం లోకి తీసుకుపోయే తోడ్పాటు కావచ్చు…మంచి మనసు తో చేస్తున్న  మా  ప్రయత్నానికి మీరు చేయూతనందించాలని అనిపిస్తే మాకు కబురు పెట్టండి. మేము మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాము.

నటులుకావలెను : మా ఈ లఘు చిత్రం లో నటించేందుకు శిక్షణ పొందిన, నాటక రంగం, టీ వీ   లేదా చలన చిత్రరంగం లో అనుభవం ఉన్న నటులు కావలెను. 25 – 40 + ఉన్న నటులు 3 ,4 కావలెను. ఈ అర్హతలు మీకు ఉన్నాయని మీ భావిస్తే లేదా ఈ అర్హతలు ఉన్న వారు మీకు తెలుస్తే మాకు కబురు చెయ్యగలరు.మా ఈమెయిలు ఐడి –  khaderbad@gmail.com       లేదా కాల్ చెయ్యండి 9980422500


లింక్ : here