Monday, April 16, 2012

తెలుగుజాతి యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం

మన దేశంలో చరిత్ర ప్రసిద్ది పొందిన పట్టణాలలో రాజమహేంద్రవరం గోదావరి నది ఒడ్డున ఉన్నది. గోదావరి నది భారతదేశంలోని పెద్ద నదులలో ఒకటి. రాజమహేంద్ర వరం గురించి తలుచుకోగానే ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఙ్ఞాపకం వస్తారు. ఒకరు రాజ రాజనరేంద్రుడు మరియొకరు నన్నయబట్టు. ఆటువంటి ప్రాచీన చరిత్ర కలిగిన పట్టణంలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు 1848 సం|| లో ఏప్రిల్ 16వ తేదిన జన్మించారు. బాల్యంలోనే తండ్రి గారు చనిపోయినప్పటికి తల్లి పెంపకంలో బాల్యదశ గడిపి పాఠశాల విద్యలో ఉత్తమ విద్యార్థిగా పేరు పొందారు. ఎవరు అన్యాయంగా ప్రవర్తించినప్పటికీ సహించేవారు కాదు. నిర్భయంగా ఎదిరించి సంఘ సంస్కరణ కార్యక్రమంలోను విద్యారంగంలోను విప్లవాత్మకమైన మార్పులను తెచ్చినవభారత నిర్మాతగా పేరు పొందారు. ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం.
వీరేశలింగానికి దయ్యాల మీద,భూతాల మీద ఏమాత్రము నమ్మకం ఉండేది కాదు. ఒకసారి అతని తల్లికి మామూలు అనారోగ్యం కలిగింది. కానీ భయపడి పోయి ఎవరో తనపై చేతబడి చేశారని భ్రమపడి ఒక మాంత్రికుడిని తీసుకుర్మని కొడుకుని ఆదేశించింది.
తనకు ఏ మాత్రం విశ్వాసం లేకపోయినా తల్లిపై గలన గౌరవంతో మాంత్రికుడిని తీసుకువచ్చాడు. అతని తల్లికి మంత్రం వేశాడు మాంత్రికుడు. వీరేశలింగం అతనికి ఇవ్వవలసిన ఫీజు ఇవ్వక నువ్వు చక్కని సేవ చేశావు. నీలాంటి సేవా తత్పరులు ధనాన్ని ఆశించకూడదు. ఇలాగే సేవ చేస్తుండాలి. భగవంతుడు నీకు తప్పక మేలు చేస్తాడు. ఇంకా సెలవు తీసుకో అని చెప్పి పంపబోయాడు. కానీవాడు వినలేదు. డబ్బు ఇమ్మని మొరాయించాడు. వీరేశలింగం మాత్రం ఇవ్వను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమ న్నాడు. అయితే రేపు ఉదయంలోగా నువ్వు రక్తం కక్కుకుని చస్తావు అని మాంత్రికుడు హెచ్చరించి అక్కడే అరుగు మీద కూర్చున్నాడు. మర్నాడు ఉదయం ఆ మాంత్రికుడు రక్తం కక్కుకుని సొమ్మసిల్లి పడిపోయాడు. పాపం వీరేశలింగం అతనిపై నీళ్లు జల్లి ఉపచారాలు చేసి భోజనం పెట్టి ఇలాంటి పిచ్చి వేషాలు వేయవద్దని హెచ్చరించి పంపించి వేశాడు.
 1870 సం|| లో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై అధ్యాపక వృత్తి చేపట్టారు. 1874 లో తూర్పు గోదావరి జిల్లాలొని ధవళేశ్వరంలో బాలికోన్నత పాఠశల స్థాపించారు. ఆ విధంగా మహిళా విద్యకు ప్రోత్సాహమిచ్చారు. సంఘసంస్కరణలు అమలు పరచడా నికి వివేక వర్ధిని, హాస్య సంజీవిని అను రెండు తెలుగు పత్రికలు 1876లో ప్రారంభించారు. 1883 లో సతీహిత బోధిని అనే పత్రికను స్థాపించి మహిళాభ్యుదయానికి తొడ్పడ్డారు. తరువాత మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితునిగా చేరారు. ఉద్యోగ విరమణ అనంతరం రాజమండ్రి తిరిగి వచ్చి తమ కార్యక్రమాన్ని కొనసాగించారు. రాజా రామ్ మోహన్ రాయ్ గారు స్థాపించిన బ్రహ్మ సమాజ మతము ఆయన జీవితంలో ఒక మలుపు తెచ్చింది. సంఘ సంస్కరణ కార్యక్రమాలకు ఆయన మార్గదర్శకులు ఆయ్యారు. తెలుగు భాషలో పాండిత్యం సంపాదించి అతి సరళ భాషలో అనేక వ్యాసాలు వ్రాసి తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చారు. ఆయన వ్యాసాల్లొ సున్నితమైన హాస్యము దైనందిన జీవితంలోని కష్ట సుఖాలు విమర్శలు అందరిని ఆకర్షించాయి.
ఆయననుఆంగ్ల సాహిత్యం ఎక్కువగా ఆకర్షించింది.తెలుగు సాహిత్యంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి గద్య తిక్కనగా కీర్తింపబడ్డాడు.షెక్‌స్పియర్ వ్రాసిన నాటకాలన్నీ తెలుగు లోకి అనువదించారు. రాజశేఖర చరిత్రము అను నవలను వ్రాసి ఆంధ్ర ప్రదేశంలో నాడు నెలకొన్న వాతావరణాన్ని చిత్రీకరించారు. ఆదే తెలుగులో వచ్చిన ప్రధమ నవల వచనములో తొలిసారిగా వ్రాసింది కందుకూరే. అందుకే అయనను గద్దె తిక్కన అంటారు.
కాళిదాసు అభిఙ్ఞాన శాకుంతలము అనే పుస్తకాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించారు. తెలుగు కవుల జీవిత చరిత్రను పరిశోధించి ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఎన్నో ప్రహసనాలు వ్రాసి నాటి సమాజంలో వున్న దురాచారాలను మూడనమ్మకాలను వెలుగులోకి తెచ్చారు. ఆయన రచనల వల్ల సమాజంలో విప్లవాత్మ కమైన మార్పులు వచ్చాయి.
ఆయన ఏకారాధన యందు నమ్మకం ఉండేది. రాజా రామమోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్ర సేన్, పండిత శివ నాధ శాస్త్రి వంటి బ్రహ్మ సమాజ ప్రముఖుల అడుగుజాడలలో నడిచారు. తరువాత బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడుగారితో పరిచయం ఏర్పడి ఆయన నాయకత్వంలో బ్రహ్మ సమాజ మతవ్యాప్తి కి కృషి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో వీరిరివురు సంఘసంస్కరణ కార్యక్రమాలలో రెండు దృవతారలుగా పేరు తెచ్చుకున్నారు. వారి జీవితకాలంలో రాజమండ్రి, కాకినాడ మచిలీపట్నం, గుంటూరు పట్టణాల్లొ బ్రహ్మ సమాజ మందిరాలు స్థాపించబడ్డాయి. బెంగుళూరులో బ్రహ్మ సమాజ మందిరాన్ని వీరేశలింగం పంతులుగారే ప్రారంభించారు.
ఆయన మూఢనమ్మకాలను, బాల్యవివాహాలను నిర్భయంగా వ్యతిరేకించేవారు. వేశ్యవృత్తిని, ఆంటరాని తనాన్ని, కుల వివక్షతను ఆయన నిరోధించడానికి ఎంతో కృషి చేశారు. మహిళా విద్యాభివృద్దికి ఆయన జీవితం అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వంటి ప్రముఖునికి వచ్చిన కీర్తి ప్రతిష్టలు ఈయనకు వచ్చాయి. వితంతు వ్యవహారాలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నప్పటికి స్థిరంగా నిర్భయంగా లన కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించారు.
ఆయన సొంత ఆదాయంతో హితకారిణి సమాజం, పురమందిరం, వితంతు గృహాలు రాజమండ్రిలో నిర్మించారు. ఆయన సాహిత్యరంగంలో ఎనలేని కీర్తి గడించారు. సంఘసంస్క్ర్తగా ఆయన పేరు ఆంధ్రచరిత్రలో స్థిరస్థాయిగా నిలిచింది. ఆయన సేవనను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం రావ్‌బహదూర్ అనే బిరుదునిచ్చి సత్కరించింది.
ఈయన 1919లో మద్రాసులో మే 27 న తుది స్వాస విడిచారు. ఆయన మరణించిన తరువాత రాజమండ్రిలో ప్రముఖుల కూడలులో ఆయన నిలువెత్తు విద్రహాన్ని ఆయన స్మృత్యర్ధంనిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయన గొప్పతనన్ని గుర్తించి హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై నిర్మించిన ప్రముఖుల శిలావిగ్రహాలలో ఒకటిగా నిర్ణయించి ఆయన పేరు ఆంధ్రుల మనసులలో చిరస్థాయిగా నిలిచేటట్లు ఒక శిలా విగ్రహాన్ని నిర్మించారు.
సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి సంఘంలోని దురాచారాలపై అన్యాయాలపై, దుష్టులపై దాడి జరిపి లంచగొండి అధికారులకు సింహస్వప్నంలా ఆయన పత్రికలను నడిపారు. ఆయనకు ఎన్ని బెదిరింపులు వచ్చిన్నప్పటికి, ఎన్ని విమర్శలు వచ్చినప్పటికి ధైర్యంతో ఎదుర్కొని పత్రికలను నిస్వార్ధంతో నడిపించేవారు. ఆయన నవయుగవైతాళికుడిగా తెలుగువారందరికి చిరస్మరణీయుడిగా నిలిచి పోయారు . తెలుగు భాష వ్యాప్తికి పత్రికల ద్వారా వాడుక భాషను ఉపయోగించి నడిపేవారు. మన భారతీయ చరిత్రపుటల్లో చిరస్థానం పొందిన సంఘసంస్కర్త శ్రీ కందూకూరి వీరేశలింగం. మహిళలకు విద్య అవసరం అని, వితంతువులకు పునఃవివాహములు అవసరమని ప్రచారం చేసి మూడాచారాలను, మూఢనమ్మకాలను, సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి శ్రీ కందూకూరి చేసిన సేవలు చిరస్మరణీయం.
Sources: Suryaa,andhrabhoomi and some articles

No comments:

Post a Comment