Friday, June 17, 2016

తెలుగుదేశం రాజకీయ విశ్లేషకులు నరసింహారావు

బయట తిరిగే మూర్ఖుల కన్నా ముసుగేసుకుని మాట్లాడే మేధావులే సమాజానికి ప్రమాదకరం. సాధారణ రాజకీయనాయకులు చెప్పే మాటలను ప్రజలు కొద్దిమేర మాత్రమే విశ్వసిస్తుంటారు. కానీ మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు చెబితే చాలా మంది జనం నిజమే కాబోలు అని నమ్మేస్తుంటారు. అందుకే చంద్రబాబు కొందరు మేధావులకు, కొందరు సీనియర్ జర్నలిస్టులకు ముసుగేసి సమాజం మీదకు వదులుతుంటారు. అలాంటి వారెవరన్నది జనం కూడా ఈ మధ్య బాగానే గుర్తిస్తున్నారు.
గౌరవనీయులైన రాజకీయ విశ్లేషకులు నరసింహారావు టీవీ చర్చాకార్యక్రమాల్లో చేస్తున్న వాదన చూస్తే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. టీడీపీ నాయకుల కంటే ధీటుగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ, చంద్రబాబును ఆయన వెనకేసుకొస్తున్న తీరు చాలా దూకుడుగా ఉంటోంది. బుధవారం ఒక టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు. రుణమాఫీ విషయంలో వైసీపీ నేతలు అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారంటూ అదే చర్చలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కంటే ఎక్కువగా వాదించారు. చంద్రబాబు లక్షా 45 వేల కోట్ల అవినీతి చేశారంటూ ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై పత్రికల్లో వచ్చిన కథనాలు కూడా అవాస్తవాలని ఆరోపించారు.
విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృతస్తాయి సమావేశం చాలా దారుణంగా జరిగిందని, నిరాశపరిచిందని తేల్చేశారు. ప్రతిపక్షం గొంతును చంద్రబాబు నొక్కడం లేదని జగనే తన పార్టీలోని ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారని అచ్చం టీడీపీ నాయకుల తరహాలోనే మాట్లాడారు. జగన్‌ కూడా సీపీఐ నారాయణ లాగా ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని చెప్పారు. ఒక దశలో చర్చలో పాల్గొన్న ఇతర పార్టీల నాయకులు నరసింహారావు తీరును తప్పుపట్టారు. ఒక విశ్లేషకుడిగా మాట్లాడితే బాగుంటుందని, టీడీపీకి వత్తాసు పలకడం సరికాదని హితవు పలికారు. ఇలా వన్‌సైడ్ మాట్లాడడం మానుకోవాలని నరసింహారావుకు వైసీపీ నేత ధర్మశ్రీ సూచించారు.
సాధారణంగా జర్నలిస్టులు, విశ్లేషకులు, మేధావులు ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపుతుంటారు. అలా కాకుండా నరసింహారావు చంద్రబాబును ఆకాశానికెత్తి ప్రతిపక్షాలను విమర్శించడం చూస్తుంటే ఈయన పచ్చ కండువా కప్పుకోవడం ఒక్కటే మిగిలిందన్న భావన వ్యక్తమవుతోంది.. నరసింహారావు ఇప్పుడే కాదు.. 2014 ఎన్నికల సమయంలో మనోవిశ్లేషకుడినంటూ టీడీపీ అనుకూల పత్రికలో కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌ ఉన్మాది, జగన్ సైకో అంటూ ఎడిటోరియల్స్ కూడా రాశారు. ఇలాంటి వారి వల్లే ఏపీలో రాజకీయ విశ్లేషకులపై జనంలో నమ్మకం తగ్గుతోందన్న భావన వ్యక్తమవుతోంది.
 

No comments:

Post a Comment