Tuesday, February 21, 2012

పొత్తులు అనివార్యం: నారాయణ

కమ్యూనిస్టులకు విశ్వసనీయత ఉన్నందునే బూర్జువా పార్టీలు తమతో పొత్తు పెట్టుకుంటున్నాయే తప్ప.. వామపక్షాలపై ప్రేమతో కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టులు స్ఫటికంలా ఉండి ఎన్నికల్లో పోరాడాలనుకోవటం మంచిదే అయినా పరిస్థితులు అందుకు తగ్గట్లుగా లేవన్నారు. భావాలు కోటలు దాటుతున్నా కాలు గడప దాటాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పొత్తులు అనివార్యమని స్పష్టం చేశారు. ఒకటో రెండు సీట్లు గెలిచినప్పుడే గుర్తింపు వస్తోందని.. అందుకే ఈ ఆరాటమని పేర్కొన్నారు.
"కమ్యూనిస్టులు సొంతంగా నిలబడే శక్తి లేకనే బూర్జువా పార్టీలను తిట్టినా వాటితో పొత్తులు పెట్టుకోవాల్సి వస్తోంది. పొత్తులు పెట్టుకున్న ప్రతిసారీ కమ్యూనిస్టులకన్నా బూర్జువా పార్టీలకే ఎక్కువ మేలు జరుగుతోంది. పొత్తులు లేకుండా 1999లో సొంతంగా పోటీ చేసి చేతులు కాల్చుకున్నాం. 1983లో ఎన్.టి.రామారావు అధికారంలోకి వచ్చాక రాజకీయాల్లో మార్పులొచ్చాయి. అనివార్యంగా ఏదో ఒక పక్షం వహించాల్సివస్తోంది. ప్రస్తుతం అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఏ ఒక్క పార్టీ సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. సంకీర్ణయుగం ప్రారంభమైంది. జనం మా కన్నా తెలివైన వాళ్లు. మమ్మల్ని మంచోళ్లంటూనే.. ‘మీరు ఎలాగూ అధికారంలోకి రారు కదా అందుకే వేరే వాళ్లకు ఓటేస్తున్నాం’ అంటున్నారు. పొగడ్తలు మాకు, ఓట్లు వాళ్లకు.. మాకు అధికారం అప్పగించేందుకు ప్రజలు ఇంకా సిద్ధపడటం లేదు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం. తోక పార్టీలంటూ తలకాయలేని వాళ్లు కొందరనేదాన్ని పట్టించుకోం. తల ఎంత ముఖ్యమో తోక అంతే ముఖ్యమని మాతో పొత్తు పెట్టుకునే వాళ్లకు తెలుసు. "అని అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment