ఇండిపెండెన్స్ డే సందర్భంగా నా మనస్సులో మాటని పంచుకోవాలనుకుంటున్నాను. ఫ్రీడమ్.. from what? దేని నుంచి స్వేచ్ఛ? 79 సంవత్సరాల క్రితం వరకూ భౌతికంగా వేరే వాళ్ల పాలనలో ఉన్న మన దేశం గురించే కదా.. యెస్.. ఆ స్వేచ్ఛ చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం. కానీ బాధ్యత కలిగిన భారతీయ పౌరుడిగా నిజమైన స్వేచ్ఛ గురించి ఇప్పుడు ప్రస్తావిస్తాను. ఈ దేశాన్ని ఇప్పటికీ అనేక బంధీఖానాలు సతమతం చేస్తున్నాయి.
ఏ దేశం ముందుకెళ్లాలన్నా యువశక్తి అత్యంత ముఖ్యమైనది. ఎక్కడైతే యువత నిర్వీర్యం అవుతుందో అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో యువత డ్రగ్స్ బారిన పడుతోంది. మీరు కొద్దిగా దృష్టి పెట్టి వింటే మీ చుట్టు పక్కల కొన్ని నగరాలు, పట్టణాల్లోనే ఇంజనీరింగ్ కాలేజీల పక్కన డ్రగ్స్ వినియోగం ఉదంతాలు మీ దృష్టికి వస్తాయి. మత్తులో జోగే ఏ యువతా దేశానికి ఉపయోగపడలేదు, లక్ష్యబద్ధంగా ఉండలేదు. అలాగే దేశం మొత్తం ఒకటే మొబైల్ అడిక్షన్. అన్ని పనులూ మానేసి.. పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్తో ఉన్న వీడియోలు చూడడమే గొప్పగా యువత ఫోన్లకి అడిక్ట్ అవుతోంది. మూడేళ్ల క్రితం నేను ఇండోనేషియా బాలి వెళ్లాను. అది చాలా చిన్న పర్యాటక ప్రదేశం. అక్కడ షాపింగ్కి వెళితే షాపుల వాళ్లు కస్టమర్స్ లేనప్పుడు మనలా ఫోన్లు పట్టుకుని కనిపించలేదు. రోడ్ మీద నిలబడి ఎవరికి వారు గిటార్, ఫ్లూట్ వంటివి నేర్చుకుంటూ, లేదా కస్టమర్ల రాక కోసం అలా రోడ్ మీద చూస్తూ కూర్చున్నారు. అసలు మొబైల్ అనేది అక్కడ అతిగా పట్టుకోవడం నేను చూడలేదు.
దీనికి మన వాళ్లు.. మన దేశంలా ఆ దేశం అభివృద్ధి చెందిందా.. అని మాట్లాడొచ్చు. అభివృద్ధి వేరు, వ్యక్తి ఎదుగుదల వేరు. సహజవనరులు, వ్యవసాయ ఉత్పత్తులు, విస్తీర్ణం ఎక్కువగా ఉన్న మన దేశం, చైనా లాంటి దేశాలు ఎగుమతులు ద్వారా సంపద సృష్టించడం సంగతి మనం ఎదుగుదలగా భావిస్తున్నాం గానీ.. చిన్న దేశాలైన సింగపూర్, బాలి, న్యూజీలాండ్ లాంటి వాటిలో ఉన్న డిసిప్లెయిన్, వ్యక్తుల స్థాయిలో పరిపక్వత గురించి మనం గమనించకపోతే, నేర్చుకోకపోతే మన జనాభానే మన ఆర్థిక ఎదుగుదలని కొన్నేళ్లకి వెనక్కి నెట్టేలా తయారవుతారు.
ఇకపోతే.. మీడియా! ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశంలోనూ.. మన దగ్గర ఉన్నంతగా మీడియా సామాన్యుల మైండ్స్ని ప్రభావితం చేసే స్థాయిలో లేదు. వేలంవెర్రిగా నచ్చిన ఛానెల్స్, నచ్చిన భావజాలం మళ్లీ మళ్లీ మనసుల్లో ఇంజెక్ట్ చేసే ఛానెల్స్ చూడడం, కండిషనింగ్ కావడం, భావోద్వేగాలకు లోనవ్వడం, సమాజంలో ఏదైనా సంఘటన జరిగితే మాస్ హిస్టీరియా.. వారానికో కొత్త సంఘటనతో మీడియా మనషుల్ని ఏ పనీ స్వేచ్ఛగా చేసుకోనీయకుండా హైజాక్ చెయ్యడం ఇవన్నీ.. దేశానికి చాలా పెద్ద శత్రువులు. ఒకప్పుడు వ్యవస్థలు బాగా పనిచెయ్యడానికి మీడియా సహకారం అవసరం అయ్యేది. ఇప్పుడు ప్రభుత్వాలకు వంతపాడే స్వంత మీడియా వచ్చాక, వ్యవస్థలు బాగున్నా బాగాలేకపోయినా.. వాటి గురించి ఆలోచించే వారు లేరు. కోతి ఏడ్చింది, కుక్క పాలు తాగింది... లావణ్య బాయ్ఫ్రెండ్ గురించి వెల్లడించిన షాకింగ్ నిజాలు.. ఇవన్నీ వార్తలైన తర్వాత ఇలాంటి మీడియా, ఇలాంటి సోషల్ మీడియా దేశానికి ఎంత నష్టం చేకూరుస్తుందో గుర్తించకపోతే భవిష్యత్ తరాలు ఈ తప్పిదాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
రాజకీయ నాయకులకు వ్యక్తి పూజ చెయ్యడం మన దేశంలో ఎక్కువ. కొన్నేళ్ల క్రితం నేను వ్యక్తిపూజకి సంబంధించిన సైకలాజికల్ యాస్సెక్ట్స్, ప్రపంచంలో వివిధ దేశాల ప్రజల మనస్థత్వాల గురించి కొన్ని పరిశోధనా గ్రంధాలు చదివాను. ఏ దేశంలో అయితే ప్రజలకు తమ పట్ల తమకు నమ్మకం ఉండదో, ఆర్థిక స్వేచ్ఛ ఉండదో.. ఆ దేశంలో ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారు.. అని నాయకులను దైవాంశ సంభూతులుగానూ, వారితో ఫొటోలు దిగాలి, వారిని కీర్తించాలి, వాళ్ల ప్రాపంకం పొందాలి, ఇంకా ఇంకా ఏదేదో చేసి వారి దగ్గర ఓ చిన్న పదవైనా పొందాలి.. ఇలాంటి మనస్థత్వం ఉంటుందని అర్థమైంది. మన దగ్గర ఇది స్పష్టంగా చూడొచ్చు. అసలు ప్రభుత్వం అంటే ఏంటి? అన్న స్పష్టత చాలామందిలో లోపించింది. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చిన డబ్బులను రోడ్లు, విద్య, వైద్యం, సంక్షేమం వంటి మౌలిక సదుపాయాలకు సమర్థంగా ఖర్చుపెట్టడానికి, వ్యవస్థలను సమర్థంగా నిర్వహించడానికి ప్రభుత్వాలు తప్పించి.. అంతకన్నా ఆకాశం నుండి దిగివచ్చిన ఫీలింగ్ ఎందుకు మనం రాజకీయ నాయకులకు ఇస్తున్నాం? అది బానిసత్వం లాంటిది. బ్రిటీష్ వాళ్ల దగ్గర మన భౌతికంగా ఇబ్బందులు పడితే, ఇప్పుడు మానసికంగా అదే తరహా బానిసత్వంలో మనం ఉన్నట్లు ఎందుకు జనాలకు అర్థం కావట్లేదు? మోదీ అయినా, రాహుల్ అయినా, చంద్రబాబు అయినా, జగన్ అయినా, రేవంత్ అయినా, కెసీఆర్ అయినా.. ఎందుకు జనాలంతా పనులన్నీ మానుకుని కీర్తిస్తున్నారో, అది ఏ విధమైన బానిసత్వమో అర్థం చేసుకుంటే, యువశక్తి స్వంత వ్యక్తిత్వంతో ముందుకు కదులుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో దేశ అధ్యక్షులను సైతం సామాన్య పౌరులుగా చూస్తుంటారు. అలాంటిది ఇక్కడ ఈ దైవాంశ సంభూత భావన చాలా ప్రమాదకరం కాదా?
ఐ.టి లాంటివి వచ్చి, ప్రపంచంతో పోల్చుకుంటే వాటిని ముందే అందిపుచ్చుకున్న వాళ్లం కాబట్టి.. ఇప్పుడు ఆర్థికంగా మన దేశం ఎంతో కొంత బాగుంది గానీ.. నిజానికి మన యువతలో, మన పెద్ద వాళ్లలో, మన ప్రతీ పౌరుడిలో సరిచేసుకోవలసిన అంశాలెన్నో! గురజాడ అన్నారు.. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అని!!
30, 40, 50, 60.. ఏళ్లకి కూడా అశ్లీల డ్యాన్స్లు చేస్తూ.. రీల్స్ చేస్తున్న భారతీయ మహిళలను చూస్తున్నాం. అలాగే మగాళ్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ కలిసి ఒకేసారి ఐదారుగురు బాయ్ ఫ్రెండ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. కుటుంబ వ్యవస్థ కుప్పకూలింది. పిల్లలను అతిగా గారాబం చెయ్యడం లేదంటే పూర్తిగా వదిలేయడం.. తప్పించి పిల్లల పెంపకం గురించి బ్యాలెన్స్ లేదు. చదువుకునే పిల్లల్లో అటెన్షన్ స్పాన్ లేదు. ఎంతో ఫోకస్డ్గా ఆఫీస్ వర్క్ చెయ్యాల్సిన వాళ్లు కూడా టైమ్పాస్గా వర్క్ చేస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా సమస్యలే కనిపిస్తున్నాయి. ఇవన్నీ సరిచేసుకోకుండా, పునాదులను బలోపేతం చేసుకోకుండా ఇండిపెండెన్స్ ఆస్వాదించలేం. అలాగే ఇవన్నీ ఎవరో వచ్చి సరిచేసేవి కాదు… ఓ బాధ్యత కలిగిన పౌరుడిగా మనం ఫోకస్డ్గా, డిసిప్లెయిన్గా, జీవితం పట్ల క్లారిటీతో ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా సరి అవుతాయి.
ఇండిపెండెన్స్ డే విషెస్ పది వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసే వాడు దేశభక్తుడు కాదు.. తనకు తాను దేశ పౌరుడిగా బాధ్యతగా తయారయ్యే వాడు నిజమైన దేశభక్తుడు!!
నల్లమోతు శ్రీధర్